- చివరి ట్రేడింగ్ సెషన్లో ఒక శాతం పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ
- అదరగొట్టిన బ్యాంకులు, రియల్టీ, ఆటో షేర్లు
- 2023–24 లో రూ. 128.8 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి ట్రేడింగ్ సెషన్లో బెంచ్మార్క్ ఇండెక్స్లు పాజిటివ్గా కదిలాయి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)లోని బ్యాంకుల పెట్టుబడులకు సంబంధించిన రూల్స్ను ఆర్బీఐ సులభం చేయడంతో గురువారం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు పెరిగి 73,651 దగ్గర, నిఫ్టీ 203 పాయింట్ల (0.92 శాతం) లాభంతో 22,327 దగ్గర ముగిశాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 29 శాతం పెరగగా, నిఫ్టీ 25 శాతం ఎగసింది. బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం రూ.3.33 లక్షల కోట్లు పెరిగి రూ. 386.97 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.128.8 లక్షల కోట్లు పెరిగింది.
ఫుల్ జోష్లో రియల్టీ, ఆటో షేర్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని అన్ని సెక్టార్లు లాభాల్లో ముగించాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఆటో, ప్రభుత్వ బ్యాంక్ ఇండెక్స్లు 80 శాతం నుంచి 140 శాతం వరకు ర్యాలీ చేశాయి. బ్రాడ్ మార్కెట్ చూస్తే నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 2023–24 లో 70 శాతం, మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 60 శాతం లాభపడ్డాయి. వాల్యుయేషన్ ఎక్కువగా ఉందనే భయాలు ఉన్నా, పెద్ద కంపెనీలతో పోలిస్తే చిన్న కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి.
ఈ ఏడాది యూఎస్ ఫెడ్ ఎన్ని సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంశంపై ఇన్వెస్టర్లు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. కిందటి నెలలో యూఎస్ ఇన్ఫ్లేషన్ అంచనాల కంటే ఎక్కువగా రికార్డు కావడంతో వడ్డీ రేట్ల కోత అనుకున్నదాని కంటే ఆలస్యం అవుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్లో మొదటి రేట్ కట్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కానీ, ఇది కూడా శుక్రవారం వెలువడే యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటాపై ఆధారపడి ఉంటుంది.
మార్కెట్ ర్యాలీకి కారణాలు..
1) యూఎస్ మార్కెట్లు బుధవారం లాభాల్లో క్లోజయ్యాయి. డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.22 శాతం ర్యాలీ చేసింది. ఈ ఎఫెక్ట్ గురువారం సెషన్లో మన మార్కెట్లపై పడింది. ఆసియా మార్కెట్లు కూడా పాజిటివ్గా ట్రేడయ్యాయి. చైనా మార్కెట్లు బుధవారం నష్టాల నుంచి రికవరీ అయ్యాయి.
2) ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) లో ఇన్వెస్ట్ చేస్తే ఫైనాన్షియల్ కంపెనీలు ప్రొవిజన్స్ పెంచాలని కిందటేడాది డిసెంబర్లో ఆర్బీఐ రూల్స్ తెచ్చింది. తాజాగా ఈ రూల్స్లో మార్పులు చేసింది. ఫలితంగా గురువారం సెషన్లో బ్యాంకులు, ఫైనాన్షియల్ షేర్లు లాభపడ్డాయి.
3) ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) నికర కొనుగోలుదారులుగా మారారు.
3.4 % పెరిగిన యూఎస్ జీడీపీ
యూఎస్ జీడీపీ కిందటేడాది డిసెంబర్తో ముగిసిన క్వార్టర్ (క్యూ4) లో 3.4 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్లో నమోదు చేసిన 3.2 శాతం గ్రోత్ రేటుతో పోలిస్తే పెరిగింది. క్యూ4లో జీడీపీ 3.2 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేశారు.