ముంబై: మార్కెట్ ర్యాలీ కొనసాగుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచినా బెంచ్మార్క్ ఇండెక్స్లు మాత్రం మరో సెషన్నూ లాభాల్లో ముగించాయి. బ్యాంక్లు, ఫైనాన్షియల్ షేర్లు పెరగడంతో సెన్సెక్స్ గురువారం 556 పాయింట్లు (0.91 శాతం) లాభపడి మూడు నెలల గరిష్టమైన 61,749 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 166 పాయింట్లు ఎగిసి నాలుగు నెలల గరిష్టమైన 18,256 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల సంపద రూ.2.21 లక్షల కోట్లు పెరిగింది. సెక్టార్ల పరంగా చూస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, బ్యాంక్, ఆటో, ఐటీ, మీడియా, రియల్టీ, ఫార్మా, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్లు ఎక్కువగా లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 0.58 శాతం, స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 0.79 శాతం పెరిగాయి.
నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు..
యూరప్లోని మెజార్టీ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో కదిలాయి. ఫెడ్ మాదిరే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను పెంచడంతో మార్కెట్లు నెగెటివ్లో ట్రేడయ్యాయి. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్ లాభాల్లో క్లోజవ్వగా, సియోల్ మార్కెట్ మాత్రం నష్టపోయింది. చైనా మార్కెట్ లాస్లో ఓపెన్ అయిన సెషన్ చివరికి లాభాల్లోకి రాగలిగింది. బలపడుతున్న రూపాయి డాలర్ మారకంలో రూపాయి విలువ 2 పైసలు బలపడి 81.78 వద్ద సెటిలయ్యింది. దేశంలోకి డాలర్ల ఇన్ఫ్లోస్ పెరగడంతో రూపాయి బలపడుతోంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ డాలర్లను కొంటుండడం రూపాయిని బలహీనపరుస్తోంది. మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎఫ్ఐఐలు బుధవారం సెషన్లో నికరంగా రూ.1,338 కోట్ల విలువైన షేర్లను, గురువారం రూ.1,414 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
అంచనాలకు అనుగుణంగానే ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి సపోర్ట్ దొరకడంతో బెంచ్మార్క్ ఇండెక్స్ల ర్యాలీ కొనసాగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. మేజర్ సెక్టార్లలో కొనుగోళ్లు రావడంతో అప్ట్రెండ్ కొనసాగిందని వెల్లడించారు. ఫ్యూచర్లో వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చన్న సంకేతాలను ఫెడ్ ఇచ్చినప్పటికీ ఇన్ఫ్లేషన్ ఇంకా గరిష్టాల్లోనే ఉందని ఆందోళన వ్యక్తం చేయడంతో యూఎస్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయన్నారు. ‘రెండు రోజుల కన్సాలిడేషన్ తర్వాత నిఫ్టీ తన అప్ట్రెండ్ను కొనసాగించింది. ఈ బెంచ్మార్క్ ఇండెక్స్కు 18,350 – 18,370 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. 18,050–18,074 లెవెల్స్ సపోర్ట్గా పనిచేస్తాయి’ అని షేర్ఖాన్ టెక్నికల్ ఎనలిస్ట్ జతిన్ గేడియా పేర్కొన్నారు. కన్సాలిడేషన్లోకి జారుకునే ముందు మార్కెట్ మరింత పెరిగిందని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా వెల్లడించారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్లకు చెందిన పెద్ద షేర్లతో పాటు మిగిలిన సెక్టార్లు కూడా తాజా ర్యాలీలో పాల్గొన్నాయని అన్నారు. ట్రెండ్కు తగ్గట్టు పొజిషన్లను మార్చుకోవాలని, స్టాక్స్ ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు.
వడ్డీ రేట్లు పెంచిన ఈసీబీ
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో యూరో జోన్లో బెంచ్మార్క్ వడ్డీ రేటు 3.25 శాతానికి పెరిగింది. ఈ సంస్థ కిందటేడాది జులై తర్వాత నుంచి వడ్డీ రేట్లను 375 బేసిస్ పాయింట్లు పెంచింది. మరోవైపు యూఎస్ ఫెడ్ కూడా కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.25 శాతానికి చేర్చింది.
