‘కృష్ణ’కు లీకేజీల గండం.. పైప్​లైన్​కు తరచూ రిపేర్లు

‘కృష్ణ’కు లీకేజీల గండం.. పైప్​లైన్​కు తరచూ రిపేర్లు
  •     నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం
  •     ఈ నెలలో మూడుసార్లు పవర్ ట్రిప్
  •     జనాలకు తప్పని నీటి కష్టాలు

హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్​హైదరాబాద్​కు తాగునీటిని అందించే కృష్ణా పైప్​లైన్​కు తరచూ మరమ్మతులు వస్తున్నాయి. దీంతో  నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతుంది. హైదరాబాద్ మెట్రో వాటర్​బోర్డు ఈ ప్రాజెక్ట్​ను ప్రతిష్టాత్మకంగా చేపట్టి.. 1996లో  మొదటి దశ.. ఆ తర్వాత రెండో దశ, మూడో దశ ప్రాజెక్టులను  పూర్తి చేసి సగం సిటీకి నీటిని అందిస్తుంది. నాగార్జున సాగర్​ప్రాజెక్ట్​నుంచి హైదరాబాద్​కు తాగునీటిని తరలించేందుకు నల్లగొండ జిల్లా అక్కంపల్లి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించారు. 

అక్కడి నుంచి కోదండపూర్​వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు తరలించి శుద్ధి చేసిన నీటిని సిటీ శివారులోని సాహెబ్​నగర్​వద్ద నిర్మించిన రిజర్వాయర్లకు పంపింగ్​చేస్తారు. అక్కడి నుంచి సిటీలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా అవుతుంది. భారీ పైప్​లైన్ల ద్వారా నీటి సరఫరా చేసే ప్రాజెక్ట్​కు తరచూ లీకేజీలు అవుతుండగా... దీంతో సిటీకి సరఫరా అయ్యే నీటికి కోత పడుతుంది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుంది. 

సిటీకి ఇదే​ కీలకం

జంట నగరాలకు నీటి సరఫరాలో కృష్ణా ప్రాజెక్ట్​కీలకంగా ఉంది. గ్రేటర్​హైదరాబాద్​తో పాటు ఓఆర్ఆర్​ పరిధిలోని గ్రామాలకు మెట్రోవాటర్​బోర్డు తాగునీటిని అందిస్తుంది. అంతకు ముందు హైదరాబాద్​ కు కేవలం మంజీరా, సింగూరు, గండిపేట, హిమాయత్​ సాగర్​ నుంచి సరఫరా చేసేవారు. 1996 తర్వాత  కృష్ణా మొదటి దశ పూర్తయ్యాక నీటి సప్లయ్ ని పెంచారు. అంతకు ముందు హైదరాబాద్​కోర్​సిటీతో పాటు, శివారు మున్సిపాలిటీలకు బల్క్​సరఫరాతో కలిసి రోజుకు 340 ఎంజీడీలు సరఫరా అయ్యేది. ఆ తర్వాత పెరిగిన అవసరాల దృష్ట్యా తాగునీటి సప్లయ్ పెంచుతూ వస్తున్నారు. శివారు మున్సిపాలిటీలు బోర్డులో విలీనమైన తర్వాత నేరుగా వాటర్​బోర్డే అన్నింటికి నీటిని అందిస్తుంది. 

గోదావరి ప్రాజెక్ట్​కూడా పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం కృష్ణా ప్రాజెక్ట్​ ద్వారా 275 ఎంజీడీల నీటిని, గోదావరి నుంచి మరో 275 ఎంజీడీలు కలిపి మొత్తం 550 ఎంజీడీల నీటిని సిటీకి పంపిణీ చేస్తున్నారు. పెరిగిన జనాభా అవసరాలకు మరో 150 ఎండీల నీటి సరఫరా అవసరమున్నా ప్రస్తుతం చేసే పరిస్థితిలో వాటర్ బోర్డు లేదు. 

లీకేజీలతో సరఫరాలో కోత

కృష్ణా ప్రాజెక్ట్​ పైప్​లైన్​ తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో  సిటీలో తాగునీటిని బంద్​పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇప్పటివరకు పలుమార్లు పైప్​లైన్​కు మరమ్మతులు చేశారు. దీంతో ప్రతిసారీ నీటి సరఫరాను నిలిపివేయక తప్పడంలేదు. దీంతో ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదు. భారీ పైప్​లైన్​ద్వారా 2000 హెచ్​పీ కెపాసిటీ కలిగిన 8 పంప్ లను నడిపిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిచోట్ల పైప్​లైన్​లో లీకేజీలు, వాల్వ్​ల లీకేజీలు, పలుమార్లు పవర్​ట్రిప్స్​జరుగుతుంటాయని అధికారులు తెలిపారు. 

పంప్ లను  నిలిపి వేసి తిరిగి స్టార్ట్​చేయడం, పలు సందర్భాల్లో పైప్​లైన్​ లీకేజీ జరిగితే షట్​డౌన్​ చేసి మరమ్మతు చేయాల్సి ఉంటుందంటున్నారు. షట్​డౌన్​చేసి రిపేర్లు చేసే సమయాల్లో ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా బంద్​ పెడతారు. ఇలా నెలలో రెండు మూడుసార్లు పవర్​ట్రిప్​లేదా లీకేజీల సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. రిపేరింగ్​జరిగే సమయాల్లో మస్ట్ గా నీటి సరఫరా నిలిపి వేస్తామంటున్నారు. దీంతో  చాలా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా జరగక జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల నెలా బిల్లులు చెల్లిస్తున్నా నీటి సరఫరా మాత్రం సాఫీగా చేయడంలేదని వినియోగదారులు వాపోతున్నారు.