- ఎస్ఎఫ్ఐ నేతలు
ముషీరాబాద్,వెలుగు : హెచ్సీయూలో అకాడమిక్ వాతావరణాన్ని ఏబీవీపీ విచ్ఛిన్నం చేస్తూ.. గొడవలు సృష్టిస్తుందని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. హెచ్ సీయూలో ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగిన దాడిలో గాయపడిన విద్యార్థులు మోహిత్, ఆషిక, ఖాయినీ, ఫైజల్ తో కలిసి ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈనెల13న ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ఫేర్వెల్పార్టీ సందర్భంగా ఏబీవీపీకి చెందిన విద్యార్థులు .. మద్యం మత్తులో గొడవ చేసి విద్యార్థులు పార్టీని అడ్డుకున్నారని, దివ్యాంగుడైన స్కాలర్ పై అకారణంగా దాడి చేశారని
అడ్డుకునేందుకు యత్నించిన ఫైజల్ పై విచక్షణా రహితంగా దాడి చేశారని ఎస్ఎఫ్ఐ నేతలు పేర్కొన్నారు. ఘటనపై పోలీసుల దృష్టికి తీసుకెళ్తే వారు విచారణ సరిగా చేయకుండా.. రెండువర్గాల మధ్య గొడవగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. నిష్పక్షపాత విచారణ జరిపి దాడి చేసిన దోషులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఏబీవీపీ చర్యలకు వ్యతిరేకంగా క్యాంపస్ ను కాపాడుకునేందుకు విద్యార్థులు ప్రజాస్వామిక వాదులు, మేధావులు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్ఎల్ మూర్తి, నాగరాజు, శివ దుర్గారావు, అతిక్, కృప జార్జ్, రమేశ్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.