అయోధ్యకు వెళ్లను : సోనియా, రాహుల్ సరసన చేరిన లాలూ

అయోధ్యకు వెళ్లను : సోనియా, రాహుల్ సరసన చేరిన లాలూ

జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను అయోధ్యలో రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లను’ అని అన్నారు. ఇంకా నిర్మాణం దశలోనే ఉన్న రామ మందిర ప్రాణ ప్రతిష్ఠపై కొన్ని రోజులుగా మత పరమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ, ప్రధాని మోదీపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో పలువురు తాము ఈ వేడుకకు రామని తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించిన విషయం తెలిసిందే.

ఇండియా బ్లాక్‌లో సీట్ల పంపకాల చర్చలపై..

రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం మహాకూటమి మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాల ఏర్పాటులో జాప్యంపై స్పందించిన లాలూ.. సీట్ల పంపకాలకు ఏర్పాట్లకు చాలా సమయం పట్టవచ్చని బదులిచ్చారు. సీట్ల పంపకంపై లాలూ చేసిన వ్యాఖ్యకు పలువురు సీనియర్ జేడీ(యూ) నేతలు అనేక సందర్భాల్లో సీటు షేరింగ్ కసరత్తు నెమ్మదిగా సాగడంపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్ కూడా అంతకుముందు ఇండియా కూటమి తన భవిష్యత్తు వ్యూహాలను త్వరగా ఖరారు చేయాలని అన్నారు.