ముంబై: కిందటి వారం డల్గా కదిలిన మార్కెట్ను ఈ వారం వివిధ అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యంగా కంపెనీల క్యూ4 రిజల్ట్స్ మార్కెట్ డైరెక్షన్ నిర్ణయిస్తాయి. ఈ నెల 21 న రిలయన్స్, 22 న ఐసీఐసీఐ బ్యాంక్ రిజల్ట్స్ వెలువడ్డాయి. వీటి రిజల్ట్స్ అంచనాలను అందుకోవడంతో సోమవారం మార్కెట్ పాజిటివ్గా కదిలే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, మారుతి సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ వెలువడనున్నాయి. మరోవైపు ఎఫ్ఐఐ కదలికలపై కూడా ట్రేడర్లు దృష్టి పెట్టనున్నారు.
ఈ నెల విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా మారారు. ఈ నెలలో ఇప్పటి వరకు రూ. 6,948 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ వారం యూఎస్ జీడీపీ డేటా విడుదల కానుంది. అంతేకాకుండా జాబ్స్ డేటా కూడా వెలువడనుంది. మార్కెట్పై వీటి ప్రభావం ఉంటుంది. ‘ ఇప్పటి వరకు కంపెనీల క్యూ4 రిజల్ట్స్ మిశ్రమంగా ఉన్నాయి. ఐటీ రిజల్ట్స్ నిరుత్సాహపరచగా, బ్యాంకింగ్ బలంగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లోనూ ఇలాంటి ట్రేండే కొనసాగే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ భారీగా పడడంతో ఐటీ షేర్లలో పుల్ బ్యాక్ ర్యాలీ కూడా కనిపించొచ్చు. గ్లోబల్ అంశాలు బలహీనంగా ఉండడంతో సస్టయినబుల్ ర్యాలీ రావడం కష్టం’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. వరుసగా మూడు వారాల్లో 5 శాతం వరకు లాభపడిన నిఫ్టీ 50, కిందటి వారం ఒక శాతం పడింది.