పాలేరు నుంచే పోటీ చేస్త : వైఎస్ షర్మిల

పాలేరు నుంచే పోటీ చేస్త : వైఎస్ షర్మిల

వైఎస్సార్ ​పాలన తెస్త 
కరుణగిరిలో పార్టీ ఆఫీస్​కు భూమి పూజ

ఖమ్మం/ ఖమ్మం రూరల్, వెలుగు : తాను పాలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని.. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ రాజశేఖర్​రెడ్డి పాలనను తీసుకొస్తానని వైఎస్సార్ టీపీ చీఫ్​షర్మిల అన్నారు. ఖమ్మం రూరల్​ మండలం కరుణగిరిలో పార్టీ పాలేరు సెగ్మెంట్ ఆఫీస్​కు విజయమ్మతో కలిసి శుక్రవారం ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. గడపగడపకూ వైఎస్సార్ ​సంక్షేమ పాలనను అందిస్తానని, ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటానని తెలిపారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్​దేనని, ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, పేదలకు ఇండ్లు ఇచ్చిన నాయకుడు ఆయనేనని గుర్తుచేశారు.  రాజశేఖర్​రెడ్డి సీఎంగా ఉన్న ఐదేండ్లలో ఒక్క పాలేరు సెగ్మెంట్​లోనే 20 వేల మంది కుటుంబాలకు ఇండ్లు ఇచ్చారని చెప్పారు. కానీ, కేసీఆర్​ సర్కారు సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. విజయమ్మ మాట్లాడుతూ..  షర్మిల పార్టీ పెట్టి 16 నెలలే అయినా అనేక పోరాటాలు చేసిందని, ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు సృష్టించినా ప్రజల కోసం ముందుకెళ్తోందన్నారు. పాలేరు నుంచి పోటీ చేసి వైఎస్సార్ ​పాలనను మళ్లీ తెస్తుందని, పాలేరే తెలంగాణను పాలించే ఊరు కాబోతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్​టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గడిపల్లి కవిత, జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్, కృష్ణమోహన్​ పాల్గొన్నారు. 

తరలివచ్చిన అభిమానులు

పాలేరులో పార్టీ ఆఫీస్​కు భూమి పూజ చేసేందుకు షర్మిల, విజయమ్మ రాగా.. ఆ సెగ్మెంట్​లోని కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. షర్మిలకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్​ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్​ విగ్రహానికి షర్మిల పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత సర్వమత ప్రార్థనలు చేశారు.