న్యూఢిల్లీ: చాలారోజుల తర్వాత కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. గురువారం పార్లమెంట్ హౌస్లో దాదాపు అరగంటపాటు సమావేశమయ్యారు. భేటీ అనంతరం తామంతా ‘ఐక్యంగానే ఉన్నాం.. ఒకే పేజీపై ఉన్నాం’ అంటూ థరూర్ ట్వీట్ చేశారు. ‘‘ఖర్గే, రాహుల్ను కలిశాను. అనేక అంశాలపై చర్చించాం. దేశ ప్రజల సేవకు ఒకే అభిప్రాయంతో ముందుకు సాగుతున్నాం”అని పేర్కొన్నారు.
పార్టీ నాయకత్వంపై థరూర్ అసంతృప్తితో ఉన్నారని కొద్దిరోజులుగా ప్రచారమవుతున్న క్రమంలో తాజాగా ఆయన పార్టీ అగ్రనాయకులతో భేటీ కావడం.. వారి ఐక్యతపై స్పష్టతను ఇచ్చినట్లయింది. మొత్తానికి థరూర్ ట్వీట్తో పార్టీలోని విభేదాల ఊహాగానాలకు తెరపడినట్లయింది.
