
న్యూఢిల్లీ: బీజేపీ నామినేట్ చేసే వ్యక్తే ఉప రాష్ట్రపతిగా ఎన్నికవుతారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. తదుపరి ఉప రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికవుతారని శనివారం ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘‘కాబోయే ఉప రాష్ట్రపతి ఎవరనేది తెలియదు. కానీ బీజేపీ నామినేట్ చేసే వ్యక్తే ఎన్నికవుతారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కు తేడా ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఎమ్మెల్యేలూ ఓటు వేస్తారు.
కానీ ఉప రాష్ట్రపతి ఎన్నికలో లోక్సభ, రాజ్యసభ సభ్యులే ఓటు వేస్తారు. ఇప్పుడు పార్లమెంట్లో మెజార్టీ ఎవరికి ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి అధికార పార్టీ నామినేట్ చేసే వ్యక్తే ఉప రాష్ట్రపతి అవుతారు” అని థరూర్ తెలిపారు. అయితే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికపై ప్రతిపక్షాలను కేంద్రం సంప్రదిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.