
న్యూఢిల్లీ: కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ధరల పెరుగుదల వంటి సమస్యల వల్ల ప్రపంచమంతటా స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు భారీగా తగ్గాయి. పోయిన ఏడాది మొదటి మూడు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (క్యూ1) షిప్మెంట్లు 11 శాతం తగ్గాయని గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ ఎనలిస్ట్ ఫర్మ్ కెనలిస్ తెలిపింది. ఇది విడుదల చేసిన రిపోర్టు ప్రకారం... ఇదేకాలంలో శామ్సంగ్ మార్కెట్ వాటా 22 శాతం నుంచి 24 శాతానికి పెరిగింది. శామ్సంగ్, యాపిల్ షిప్మెంట్ల పరంగా మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. షావోమీ, ఒప్పో, వివో టాప్–5 లిస్టులో ఉన్నాయి. ఫ్లాగ్షిప్ మోడల్ గెలాక్సీ ఎస్22 సిరీస్ఫోన్లు భారీగా అమ్ముడుకావడంతో మార్కెట్ వాటా పెరిగిందని శామ్సంగ్ తెలిపింది. ఎక్కువగా గిరాకీ ఉన్న గెలాక్సీ ఏ, ఎం సిరీస్లలోనూ మోడల్స్ సంఖ్యను పెంచింది. యాపిల్ షిప్మెంట్లు 2021 క్యూ1లో 15 శాతం ఉండగా, ఈసారి క్యూ1లో ఇవి 18 శాతానికి చేరాయి. కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ ఎస్ఈ మోడల్ ధర కొంచెం తక్కువ కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఐఫోన్ 13 అమ్మకాలు కూడా బాగున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. 5జీ ఫోన్లను కూడా జనం ఎగబడి కొంటున్నారు. షావో, ఒప్పో షిప్మెంట్లు ఒక్కశాతం తగ్గాయి. చిప్ల వంటి విడిభాగాల కొరత తగ్గుతోందని, త్వరలోనే పూర్తిస్థాయి సప్లై మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని కెనలిస్ట్ రిపోర్టు పేర్కొంది. దీనివల్ల ఖర్చులు తగ్గి రాబోయే క్వార్టర్లలో ఇండస్ట్రీ ఇంకా ముందుకు వెళ్తుందని వివరించింది.