శివంగి టీమ్.. రెండో ఆపరేషన్ సక్సెస్.. రిస్క్ చేసి పలువురిని రక్షించిన మహిళా పోలీసులు

శివంగి టీమ్.. రెండో ఆపరేషన్ సక్సెస్.. రిస్క్ చేసి పలువురిని రక్షించిన మహిళా పోలీసులు
  • నిర్మల్ జిల్లా కేంద్రంలో రెండురోజుల కింద వర్ష బీభత్సం
  • కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు
  • ఇరుక్కుపోయిన వాహనాలు, స్థానిక ప్రజలు 
  • స్థానికులు, సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ


నిర్మల్, వెలుగు: ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్ష బీభత్సం సోమవారం రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రాన్ని అతలాకుతలం చేసింది. బ్రహ్మపురి, షేక్ సాహెబ్ పేట వీధి, పాత తహసిల్ ఆఫీస్ వద్ద చాలా చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు నేల కూలాయి. బ్రహ్మపురి, షేక్ సాహెబ్ పేట ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోయాయి. దీంతో కొన్ని వాహనాలతో పాటు పలువురు స్థానికులు చిక్కుకున్నారు.  

సమాచారం తెలియడంతో మంగళవారం (june 10) ఎస్పీ జానకి షర్మిల ఆపరేషన్ శివంగి చేపట్టారు. 12 మంది మహిళా పో లీస్ లు రంగంలోకి దిగారు.  చెట్ల కింద ధ్వంసమైన వాహనాలను, చిక్కుకుపోయిన ఇద్దరు వృద్ధులను బయటకు తీసి కాపాడారు.  

శివంగి టీమ్ కు టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ అడ్మిన్ రామ్ నిరంజన్ రావు, ఆర్ఐ శేఖర్, ఆర్ఎస్ఐ రాజశేఖర్ సహకారం అందించారు.  మహిళా పోలీసులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆపరేషన్ చేపట్టి విజయవంతం చేశారు.  ధైర్యసాహసాలు చూపిన శివంగి టీమ్ సేవలను స్థానికులు అభినందించారు. సోషల్ మీడియాలోనూ నెటిజెన్లు భారీగా ప్రశంసలు కురిపించారు.  

 ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా మహిళా పోలీసులతో ఏర్పాటైన శివంగి టీమ్ చేపట్టిన రెండో ఆపరేషన్ సక్సెస్ అయింది. రెండు నెలల కింద మామడ మండలం కప్పనపల్లిలో కొందరు మహిళలు తునికాకు వెళ్లి అడవిలో తప్పిపోగా  శివంగి టీమ్ 12 గంటల పాటు దట్టమైన అడవిలో గాలించి ఆచూకీ కనుగొని రక్షించిన విషయం తెలిసిందే.