
- షార్ట్ రన్, రిటైర్డ్ ఔట్ రూల్స్లోనూ కీలక మార్పులు
- గైడ్ లైన్స్ విడుదల చేసిన బీసీసీఐ
న్యూఢిల్లీ: రాబోయే డొమెస్టిక్ క్రికెట్ సీజన్లో బీసీసీఐ కీలక మార్పు చేసింది. ఇకపై మల్టీ -డే (టెస్ట్) మ్యాచ్ల్లో ఆటగాడు తీవ్రంగా గాయపడితే, అతని స్థానంలో మరొకరిని తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవల జరిగిన ఇంగ్లండ్ సిరీస్లో ఇండియా కీపర్ రిషబ్ పంత్, ఇంగ్లిష్ టీమ్ పేసర్ క్రిస్ వోక్స్ తీవ్ర గాయాల పాలైన నేపథ్యంలో ఈ కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు తలకు దెబ్బ (కంకషన్) తగిలనప్పుడు మాత్రమే ప్లేయర్ రీప్లేస్మెంట్కు అనుమతి ఉంది. ‘సీరియస్ ఇంజ్యురీ రీప్లేస్మెంట్’ పేరిట బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం మ్యాచ్ టైమ్లో తీవ్రంగా గాయపడిన ప్లేయర్ను మరొకరితో భర్తీ చేసేందుకు అవకాశం ఇస్తారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను బోర్డు విడుదల చేసింది.
అహ్మదాబాద్లో జరుగుతున్న అంపైర్ల సెమినార్లో అంపైర్లకు లేటెస్ట్ ప్లేయింగ్ కండిషన్స్ను వివరించింది. ఈ నెల 28 నుంచి జరిగే దులీప్ ట్రోఫీ, సీకే నాయుడు టోర్నీలో ‘ఇంజ్యురీ రీప్లేస్మెంట్’ రూల్ అమల్లోకి రానుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20, విజయ్ హజారే వన్డే ట్రోఫీ వంటి వైట్ బాల్ క్రికెట్ ఈవెంట్లలో ఈ రీప్లేస్మెంట్ను అనుమతించబోమని బోర్డు స్పష్టం చేసింది. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి సీజన్లో ఈ రూల్ను అనుమతిస్తారో లేదో చూడాలి. ఇక, అన్ని ఫార్మాట్ల కోసం బ్యాటర్ల ఉద్దేశపూర్వక షార్ట్ రన్, రిటైర్డ్ ఔట్ రూల్స్లోనూ మార్పులు చేసింది.
రీప్లేస్మెంట్ ఇలా
ఈ కొత్త రూల్ కేవలం మల్టీ-డే క్రికెట్కు మాత్రమే వర్తిస్తుంది. లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్లకు కాదు. ఆటగాడు మ్యాచ్ ఆడుతున్నప్పుడు, ప్లే గ్రౌండ్లోనే ఈ గాయం అవ్వాలి. ఆ గాయం ఫ్రాక్చర్, డీప్ కట్ లేదా డిస్లొకేషన్ లాంటిది అయి ఉండాలి. అది ఆ ఆటగాడిని మిగతా మ్యాచ్కి దూరం చేసేంత తీవ్రంగా ఉంటేనే రీప్లేస్మెంట్కు అనుమతి ఇస్తారు. గాయపడిన ఆటగాడి స్థానంలో అతని మాదిరిగానే స్కిల్స్ కలిగిన (లైక్-ఫర్-లైక్) మరో ప్లేయర్ను తీసుకోవచ్చు. జట్టు మేనేజర్ ఈ రీప్లేస్మెంట్ కోసం అంపైర్ లేదా మ్యాచ్ రిఫరీకి దరఖాస్తు చేసుకోవాలి. మ్యాచ్ రిఫరీ వైద్యులను సంప్రదించి, సదరు గాయం తీవ్రతను అంచనా వేసి తుది నిర్ణయం తీసుకుంటాడు. రీప్లేస్మెంట్గా వచ్చే ఆటగాడు టాస్ వేసే సమయంలో నామినేట్ చేసిన సబ్స్టిట్యూట్స్ ప్లేయర్ల జాబితా నుంచే ఉండాలి. వికెట్ కీపర్ గాయపడితే మాత్రం ఈ నియమం నుంచి మినహాయింపు ఉంటుంది.
భిన్నాభిప్రాయాలు
టెండూల్కర్–అండర్సన్ సిరీస్లో రిషబ్ పంత్, క్రిస్ వోక్స్ తీవ్రంగా గాయపడినప్పటికీ తమ జట్ల కోసం విపరీతమైన నొప్పిని భరిస్తూ బ్యాటింగ్కు వచ్చారు. ఆ టైమ్లోనే ఇంజ్యురీ రీప్లేస్మెంట్పై డిమాండ్లు వచ్చాయి. దీనిపై ఐసీసీ ఇప్పటివరకు స్పందించలేదు. పెద్ద గాయం అయిన సందర్భాల్లో రీప్లేస్మెంట్ ఉండాలని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. అయితే, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం ఈ వాదనను వ్యతిరేకించాడు.
ఉద్దేశపూర్వక షార్ట్ రన్కు చెక్
ఒక బ్యాటర్ పరుగు తీసే సమయంలో ఉద్దేశపూర్వకంగా క్రీజును తాకకుండా షార్ట్ రన్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ రన్ను పరిగణనలోకి తీసుకోరు. అంతేకాకుండా ఫీల్డింగ్ జట్టుకు 5 పెనాల్టీ రన్స్ ఇస్తారు. ఆ తర్వాతి బాల్కు ఎవరు స్ట్రయిక్లో ఉండాలో ప్రత్యర్థి కెప్టెన్ నిర్ణయిస్తాడు. ఒకవేళ బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ తీయలేదని అంపైర్ భావిస్తే మాత్రం ఈ రూల్ వర్తించదు.
కావాలని రిటైర్ అయితే ఇక ఔటే
ఒక బ్యాటర్ గాయం , అనారోగ్యం కాకుండా ఇతర కారణాల వల్ల ‘రిటైర్’ అయితే ఇకపై దాన్ని ‘రిటైర్డ్ -ఔట్’గా పరిగణిస్తారు. ఇలా ఔటైన బ్యాటర్ మళ్లీ బ్యాటింగ్కు తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఈ నిబంధనతో మ్యాచ్ మధ్యలో వ్యూహాత్మకంగా రిటైర్ అవ్వడం ద్వారా ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టే పద్ధతులకు అడ్డుకట్ట పడనుంది.
విజయ్ హజారేలో 34 ఓవర్ల తర్వాత ఒకే బాల్
వన్డే క్రికెట్లో రెండు ఎండ్ల నుంచి రెండు బాల్స్ నిబంధనలో ఐసీసీ ఇటీవల చేసిన మార్పులను బీసీసీఐ విజయ్ హజారే ట్రోఫీలో అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం వన్డే మ్యాచ్లో 34 ఓవర్ల వరకు రెండు ఎండ్ల నుంచి వేర్వేరు బాల్స్ వాడతారు. 34 ఓవర్ల తర్వాత వాటిలో ఒక బంతిని మాత్రమే ఉపయోగిస్తారు. ఇది ఆటలో రివర్స్ స్వింగ్ను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది.