WPL 2024 Final: మన ప్లేయర్‌కే పర్పుల్ క్యాప్.. ఎవరీ శ్రేయాంక పాటిల్..?

WPL 2024 Final: మన ప్లేయర్‌కే పర్పుల్ క్యాప్.. ఎవరీ శ్రేయాంక పాటిల్..?

శ్రేయాంకా పాటిల్‌.. భారత మహిళా క్రికెట్ లో ప్రస్తుతం ఈ పేరు సంచలనంగా మారుతుంది. టీమిండియాలో పట్టుమని పది మ్యాచ్ లు ఆడకుండానే అద్భుతాలు సృష్టిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ లీగ్ అయినా డబ్ల్యూపీఎల్ లో అంచనాలకు మించి రాణిస్తుంది. ఈ మెగా లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడుతున్న ఈ బెంగళూరు అమ్మాయి 2023 సీజన్ లో ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా నిలిచింది. 

ఒక్క సీజన్ కే తన ప్రదర్శన పరిమితం కాకుండా తాజాగా జరిగిన మహిళా ప్రీమియర్ లీగ్ లో టాప్ వికెట్ టేకర్ గా నిలిచి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ లీగ్ లో మొత్తం 8 మ్యాచ్ ల్లో 13 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకుంది. శ్రేయాంక బౌలింగ్ యావరేజ్ కేవలం 12 మాత్రమే ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఈమె నాకౌట్ మ్యాచ్ ల్లో ఆడిన తీరు అత్యద్బుతమని చెప్పుకోవాలి.

ముంబైతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో 4 ఓవర్లలో కేవలం 16 పరుగులే ఇచ్చి మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఈ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ వికెట్ తీసి ఓడిపోయే మ్యాచ్ ను ఆర్సీబీ వైపు తిప్పింది. ఇక నిన్న (మార్చి 17) జరిగిన ఫైనల్లో నాలుగు వికెట్లు పడగొట్టి ఢిల్లీ క్యాపిటల్స్ వెన్ను విరిచింది. 3.3 ఓవర్లలోనే 12 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఓ వైపు వికెట్లు తీస్తూనే మరోవైపు పొదుపుగా బౌలింగ్ చేస్తూ స్టార్ బౌలర్ గా మారింది. దీంతో ఇప్పుడు ఒక్కసారిగా ఈమె ఎవరు అని ప్రపంచ క్రికెట్ ఆరా తెస్తున్నారు.  

శ్రేయాంక పాటిల్ కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన భారతీయ యువ క్రీడాకారిణి.  21 ఏళ్ళ ఈమె ఇప్పటికే టీ20లు, వన్డేల్లో భారత  సీనియర్ మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. జనవరి 2020లో జరిగిన కర్ణాటక క్రికెట్ స్టేట్ అసోసియేషన్ (KSCA) ఉమెన్స్ లీగ్‌లో ఆమె అసాధారణ ప్రదర్శన, స్వస్తిక్ యూనియన్ క్రికెట్ క్లబ్‌పై రాజాజీనగర్ క్రికెటర్స్ తరపున ఆడిన ఆమె కేవలం 4 పరుగులకే 6 వికెట్లు తీయడం ఆమె కెరీర్ లో హైలెట్ గా నిలిచాయి. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ దృష్టిలో పడి తనను తాను నిరూపించుకొని స్టార్ గా మారింది.