ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి చిత్రాలతో విజయాలు అందుకున్న శ్రుతిహాసన్.. ఇటీవల నాని హీరోగా వచ్చిన ‘హాయ్ నాన్న’లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. మరికొద్దిరోజుల్లో ప్రభాస్ ‘సలార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా ఆమె మరో కొత్త సినిమాకు సైన్ చేసింది. అడివి శేష్తో కలిసి ఓ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాలో నటించబోతోంది.
మంగళవారం ఈ కొత్త సినిమా వివరాలను ప్రకటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ దీన్ని నిర్మిస్తున్నారు. శేష్ హీరోగా వచ్చిన క్షణం, గూఢచారి చిత్రాలకు డీవోపీగా పనిచేసిన షానీల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. షానీల్, శేష్ కలిసి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సునీల్ నారంగ్ దీనికి కో ప్రొడ్యూసర్. సినిమాలోని ప్రతి సీన్, డైలాగ్ను హిందీతో పాటు తెలుగులోనూ విడివిడిగా తీస్తున్నామని దర్శకనిర్మాతలు తెలియజేశారు.
