- తప్పించుకునే ప్రయత్నంలో మరో బైక్ను ఢీ
- డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో కారు బీభత్సం
- ఎస్సైకి గాయాలు.. వెంబడించి పట్టుకున్న పోలీసులు
- రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్ఐని ఓ కారు ఢీకొట్టి కీలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లింది. ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద సాగర్ రహదారిలో ఈ ఘటన జరిగింది. సాగర్ రోడ్డులో యాచారం ఎస్ఐ ఉయ్యాల మధు, సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో ఓ మాల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు.. బారికేడ్ల వద్ద ఆగకుండా వెళ్లేందుకు యత్నిస్తుండగా ఎస్సై అడ్డగించారు. దీంతో తప్పించుకునేందుకు ఎస్ఐ ఉయ్యాల మధును కారు ఢీకొట్టగా ఆయన బానెట్పై పడ్డారు. అయినా కూడా కారు డ్రైవర్ ఆపకుండా అతివేగంగా హైదరాబాద్ వైపు వెళ్తూ యాచారం చౌరస్తాలో బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. ఎస్ఐ కూడా బానెట్ పై నుంచి జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కారును, అందులో ఉన్న ఇద్దరిని ఇబ్రహీంపట్నం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడకు చెందిన కీసరి శ్రీకర్ రెడ్డి, హయత్ నగర్కు చెందిన నితిన్గా గుర్తించారు. నిందితులకు ఆల్కహాల్ టెస్ట్ చేయగా కారును నడిపిన కీసరి శ్రీకర్ రెడ్డికి 135 ఎంజీ ఆల్కహాల్ శాతం, నితిన్ కు 122 ఎంజీ చ్చినట్లు తెలిసింది. నిందితులపై హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేశామని యాచారం సీఐ తెలిపారు.
