సిద్దిపేట టౌన్, వెలుగు: సర్పంచులు నిబద్ధతతో పనిచేసి, గ్రామాలను అభివృద్ధి చేయాలని కలెక్టర్హైమావతి సూచించారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి సమీపంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (నాక్) సెంటర్ లో సర్పంచుల శిక్షణా తరగతులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాలను ఎలా అభివృద్ధి చేసుకోవడానికి ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు. పంచాయతీ ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలన్నారు.
ఏ పని చేసినా వార్డు సభ్యుల ఆధ్వర్యంలో పంచాయతీ తీర్మానాల ఆధారంగానే పనిచేయాలని సూచించారు. మహిళ సర్పంచ్ స్థానాల్లో భర్తలు పెత్తనం చెలాయించకూడదన్నారు. ప్రస్తుతం మొదటి విడతగా ఐదు రోజులపాటు శిక్షణ తరగతులు జరగనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీపీవో రవీందర్, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, ట్రైనీ డీపీవో వినోద్ కుమార్, అర్బన్ ఎంపీవో శోభ, ఆయా శాఖల జిల్లా, మండల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి
ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్లో అడిషనల్కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజల నుంచి142 దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ.. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా వీడియో ఫొటో గ్రాఫర్స్ ఎలక్షన్ బిల్లులు వెంటనే చెల్లించాలని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు గణతంత్ర దినోత్సవాలకు శాఖల వారీగా కేటాయించిన శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏఓ రాజ్ కుమార్ పాల్గొన్నారు.
