రెండో రోజూ రికార్డు ధర.. రూ.1.07లక్షలకు చేరిన వెండిధర

రెండో రోజూ రికార్డు ధర.. రూ.1.07లక్షలకు చేరిన వెండిధర

న్యూఢిల్లీ: స్థానిక నగల వ్యాపారులు,  స్టాకిస్టుల కొనుగోళ్ల రద్దీ మధ్య శుక్రవారం దేశ రాజధానిలో వెండి ధర రూ. 3,000 పెరిగి కిలోకు రూ. 1,07,100 రికార్డు గరిష్టాన్ని తాకింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, గురువారం స్థానిక మార్కెట్లలో దీని రేటు రూ. 2,000 పెరిగి కిలోకు రూ. 1,04,100 తాజా గరిష్టాన్ని తాకింది.  గత సంవత్సరం డిసెంబర్ 31 నుంచి కిలోకు రూ.17,400 లేదా 19.4 శాతం మేర ధరలు పెరిగాయి. 

99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర శుక్రవారం 10 గ్రాములకు రూ.99,690 వద్ద, 99.5 శాతం స్వచ్ఛత గల పసిడి ధర రూ. 99,100 వద్ద యదాతథంగా ఉంది. దేశవిదేశాల్లో డిమాండ్ వల్లే వెండి ధరలు భారీగా పెరిగాయని వ్యాపారులు తెలిపారు. జులై నెల వెండి కాంట్రాక్ట్ ధర రూ.1,622 పెరిగి కిలోకు రూ.1,06,065 తాజా గరిష్ట స్థాయికి చేరుకుంది.

 సెప్టెంబర్ నెలలో డెలివరీ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్​)లో రూ.1,650 పెరిగి కిలోకు రూ.1,07,130 జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆగస్టు నెలలో డెలివరీ కోసం బంగారం కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటు ఎంసీఎక్స్​లో 10 గ్రాములకు రూ.44 తగ్గి రూ.97,830కి చేరుకుంది. విదేశీ మార్కెట్లలో, స్పాట్ బంగారం 0.22 శాతం పెరిగి ఔన్సుకు (28.3 గ్రాములు)  3,360.05 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

ప్రపంచ మార్కెట్లలో స్పాట్ వెండి ధర ఔన్సుకు 1.63 శాతం పెరిగి  36.23 డాలర్లకు చేరుకుంది.  వెండిపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ధర 13 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుందని బ్రోకరేజ్ సంస్థ కోటక్ సెక్యూరిటీస్ తెలిపింది.