Silver Rally: కిలో వెండి రూ.లక్షా 14 వేలా.. చూస్తుండగానే ఇలా పెరిగిపోయింది ఏంటీ..!

Silver Rally: కిలో వెండి రూ.లక్షా 14 వేలా.. చూస్తుండగానే ఇలా పెరిగిపోయింది ఏంటీ..!

Silver Prices Up: గతవారం పెద్దగా మార్పులు లేకుండా కొనసాగిన వెండి ధరలు ఈ వారం తిరిగి పుంజుకున్నాయి. స్పాట్ మార్కెట్లో కేజీ వెండి ధర నేడు ఏకంగా రూ.లక్షా 04వేలకు చేరుకుని సరికొత్త ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకింది. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చిత వాతావరణంతో పాటు ట్రేడర్లు బెట్టింగ్ వేయటం పెంచటం ధరల పెరుగుదలకు కారణని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఆందోళనలు, తగ్గుతున్న ప్రైవేట్ ఉద్యోగాలు, నెమ్మదించిన సేవా రంగం వంటి కారణాలు దీనిని నడిపిస్తున్నాయి. 

ప్రధానంగా గడచిన మూడు రోజుల నుంచి రిటైల్ మార్కెట్లో కూడా వెండి ధర రూ.3500 వరకు పెరుగుదలను నమోదు చేసింది. స్పాట్ మార్కెట్లో ట్రేడర్లు డెలివరీ తీసుకునేందుకు ఎక్కువగా మెుగ్గుచూపుతున్న వేళ వెండి ధరలు మరింతగా పెరుగుతూనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఏడాది కిందితో పోల్చితే ప్రస్తుతం వెండి ధరలు 25 శాతం పెరుగుదలను చూశాయి. ఈ ఏడాది చివరి నాటికి కేజీ వెండి ధర రూ. లక్షా 20వేలకు చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న ధరల కంటే దాదాపు 20 శాతం వరకు అధికం. 

ప్రస్తుతం ఉన్న సమయంలో అసలు వెండి సరైన పెట్టుబడి ఎంపికేనా అనేదానిపై నిపుణులు ఏమంటున్నారో గమనిస్తే.. గడచిన 40-50 ఏళ్లలో కాంపౌండింగ్ ప్రాతిపదికన 3 నుంచి 4.12 శాతం మధ్య వెండి రాబడిని అందించింది. ప్రస్తుతం ఉన్న సమయంలో వెండి భవిష్యత్తు కోసం ఉత్తమ పెట్టుబడి ఎంపిక కాదని నిపుణులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్లో ధరల పతనం సమయంలో మాత్రమే వెండి ధరలు పెరిగినట్లు చరిత్ర చెబుతోంది. అయితే రక్షణాత్మక పెట్టుబడి వ్యూహంలో మాత్రమే దానిని కొంత కలిగి ఉండటం అనిశ్చిత వాతావరణంలో మంచిదని సూచించబడుతోంది. 

కొన్ని వారాల కిందట ప్రముఖ రచయిత, పెట్టుబడిదారు కియోసాకీ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఔన్సు వెండి ధర ప్రస్తుతం 34 డాలర్ల వద్ద ఉంది. అయితే దీని రేటు ఈ ఏడాది చివరి నాటికి 70 డాలర్లకు చేరుకోవచ్చని ఆయన చెబుతున్నారు. అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం కేజీ రేటు ప్రస్తుతం 34 డాలర్ల ఔన్సు లెక్కల ప్రకారం రూ.90 వేల నుంచి పెరిగి ఔన్సుకు 70 డాలర్లకు చేరితే రూ.2 లక్షల మార్కును క్రాస్ చేస్తుందని ఆయన వెల్లడించారు.

2025లో వెండి ధరలను ఏవేవి పెంచుతున్నాయి..
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వెండి దాదాపు 15 శాతం వరకు రాబడిని అందించింది. పెరుగుతున్న బంగారం ధరలు కూడా వెండి రేట్లను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం వెండి పేదవాళ్ల బంగారంగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెరుగుదలకు కొన్ని కారణాలు..

* ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక వ్యవస్థలు
* పెరుగుతున్న రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో వినియోగం
* 5జీ సాంకేతిక పరికరాల తయారీలో పెరిగిన వెండి నివియోగం
* స్మార్ట్ ఫోన్లు, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్ అవసరాలకు పెరిగిన వెండి వినియోగం
* ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో పెరిగిన వెండి వాడకం

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ మార్కెట్లలో వెండి కేజీ విక్రయ ధర రూ.లక్ష 14వేలకు పెరిగిన తర్వాత చేరుకుంది. కేవలం ఇవాళ ఒక్కరోజే కేజీ వెండి ధర రూ.2వేలు పెరుగుదలను నమోదు చేయటం భారతీయ కొనుగోలుదారుల్లో ఆందోళనలు పెంచేస్తోంది.