బాసెల్: అందని ద్రాక్షగా మిగిలిన స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ వరల్డ్ చాంపియన్షిప్ను ఘనంగా ఆరంభించారు. తొలి రౌండ్లో బై లభించడంతో రెండో రౌండ్తో ఆట ఆరంభించిన ఈ ఇద్దరు.. అలవోక విజయాలతో ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లారు. కిడాంబి శ్రీకాంత్ మాత్రం రెండో రౌండ్ దాటేందుకు కష్టపడ్డాడు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ సెకండ్ రౌండ్లో ఐదో సీడ్ సింధు 21–-14, 21–-14తో పై యు పో (చైనీస్ తైపీ)ని ఓడించింది. మరో మ్యాచ్లో ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్ 21-–10, 21–11 తో సొరయ డెవిసిచ్ (నెథర్లాండ్స్)పై వరుస గేమ్స్లో విజయం సాధించింది. పురుషుల సెకండ్ రౌండ్లో ఏడో సీడ్ శ్రీకాంత్ 13–21, 21–13, 21–16 తో మిషా జిల్బర్మన్ (ఇజ్రాయిల్)పై మూడు గేమ్ల పాటు పోరాడి గెలిచాడు. ఫస్ట్ గేమ్లో తేలిపోయిన శ్రీకాంత్ తర్వాత గొప్పగా పుంజుకున్నాడు. తర్వాతి రెండు గేమ్స్లో తనదైన శైలిలో దూకుడుగా ఆడి వరుస పాయింట్లతో విరుచుకుపడ్డాడు.
డబుల్స్ ప్లేయర్లకు నిరాశ
మెగా టోర్నీలో ఇండియా డబుల్స్ ప్లేయర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో అశ్విని పొన్నప్ప–- సిక్కిరెడ్డి జోడీ 22-–20, 21–-16తో డు యూ– లి యిన్ హుయ్ (చైనా) చేతిలో, జక్కంపూడి మేఘన– పూర్విషా రామ్ ద్వయం 8–21,18–21తో షిహో టనక– యొనెమొటో(జపాన్) చేతిలో ఓడి ఇంటిదారి పట్టాయి. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో మను అత్రి–-సుమీత్ రెడ్డి 20–-22, 16–21తో హన్చెంగ్ కై–హావో డాంగ్(చైనా) ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది.