సింగపూర్: ఇండియా స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో థ్రిల్లింగ్ విక్టరీతో సెమీఫైనల్కు చేరుకుంది. కానీ, రెండున్నరేళ్ల తర్వాత ఓ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చిన వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్కు చుక్కెదురైంది. ఆమెతో పాటు హెచ్ ఎస్ ప్రణయ్ క్వార్టర్స్లోనే ఇంటిదారి పట్టాడు. దాంతో, ఈ టోర్నీలో ఇండియా నుంచి సింధు మాత్రమే రేసులో నిలిచింది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్లో మూడో సీడ్ సింధు 17-–21, 21–-11, 21–-19తో చైనా షట్లర్ హన్ యుయెపై మూడు గేమ్స్ పాటు పోరాడి గెలిచింది. సెమీస్లో ఆమె అన్సీడెడ్, ప్రపంచ 38వ ర్యాంకర్ సయెన కవాకమితో పోటీ పడుతుంది. సయెనతో ఆడిన గత రెండు మ్యాచ్ల్లోనూ సింధు గెలిచింది. మరో క్వార్టర్స్లో కవాకమి 21–17, 21–19తో ఆరో సీడ్ చొచువాంగ్ (థాయ్లాండ్)ను ఓడించి సంచలనం సృష్టించింది. ఇక, ప్రిక్వార్టర్స్లో తొమ్మిదో ర్యాంకర్ బింగ్జియావోపై గెలిచిన లండన్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్లో 13–21, 21–15, 20–22తో జపాన్కు చెందిన అయా ఒహోరి చేతిలో పోరాడి ఓడిపోయింది. మూడో గేమ్లో రెండు మ్యాచ్ పాయింట్లను కోల్పోయిన సైనా.. ప్రత్యర్థికి మ్యాచ్ అప్పగించింది. ఇక, మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్లో ప్రణయ్ 12–-21, 21–-14, 21–-18తో కొడై నరవోక (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఫామ్లో ఉన్న ప్రణయ్ తొలి గేమ్ను తొమ్మిది పాయింట్ల తేడాతో గెలిచినా అదే జోరు కొనసాగించలేకపోయాడు. డబుల్స్ క్వార్టర్స్లో ఎంఆర్ అర్జున్–ధ్రువ్ కపిల జంట 21–10, 18– 21, 17– 21తో రెండో సీడ్ మహ్మద్ అహ్సాన్–సెతైవన్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడింది.
సింధు కష్టంగా..
క్వార్టర్ ఫైనల్ దాటేందుకు సింధు చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రపంచ 19వ ర్యాంకర్ హన్ నుంచి ఆమెకు గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్ ఆరంభంలోనే పాయింట్ల రాబట్టిన చైనా షట్లర్ బ్రేక్ టైమ్కు 11–9తో ఆధిక్యంలోకి వచ్చింది. డిఫెన్స్లో తడబడి ప్రత్యర్థికి పాయింట్లు కోల్పోయిన తెలుగమ్మాయి తొలి గేమ్ చేజార్చుకుంది. కానీ, వెంటనే పుంజుకున్న సింధు రెండో గేమ్లో జోరు చూపెట్టింది. మూడు పాయింట్ల ఆధిక్యంతో బ్రేక్కు వెళ్లిన ఆమె తర్వాత వరుసగా ఏడు పాయింట్లు రాబట్టింది. పర్ఫెక్ట్ క్రాస్ కోర్ట్ విన్నర్తో రెండో గేమ్ నెగ్గి మ్యాచ్లో నిలిచింది. అయితే, మూడో గేమ్లో హన్ నుంచి మళ్లీ ప్రతిఘటన ఎదురైంది. హోరాహోరీగా సాగిన ఈ గేమ్లో 8–11, 9–14తో వెనుకబడిన సింధు మ్యాచ్ కోల్పోయేలా కనిపించింది. కానీ, ఒక్కసారిగా తన మార్కు ఆటను బయటకు తీసిన ఇండియా షట్లర్ ర్యాలీల్లో సత్తా చాటింది. వరుసగా ఐదు పాయింట్లతో 14–14తో స్కోరు సమం చేసింది. హన్ కూడా వెనక్కితగ్గకపోవడంతో 19–19 మళ్లీ స్కోరు సమమైనా.. చివర్లో వరుసగా రెండు పాయింట్లతో సింధు మ్యాచ్ ముగించింది.