రామకృష్ణాపూర్/మందమర్రి, వెలుగు: సింగరేణి ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రతి రోజు నిర్వహించే టెస్టుల్లో 35శాతం పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపాటుకు గురిచేస్తోంది. వైరస్ విజృంభిస్తున్న క్రమంలో దరిచేరకుండా ఓ వైపు ముందు జాగ్రత్త చర్యలపై కార్మికులకు అవగాహన కల్పిస్తున్న సింగరేణి యాజమాన్యం మరోవైపు కరోనా బారినపడిన బాధితులకు మెరుగైన ట్రీట్మెంట్అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. కరోనా బారిన పడిన సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన ట్రీట్మెంట్ అందించేందుకు స్పెషల్ కరోనా సెంటర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్లోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని పూర్తిస్థాయి కోవిడ్సెంటర్గా మార్చనుంది. మరో వారం రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి.
ఫిజికల్డిస్టెన్స్అవకాశం లేక..
కరోనా నేపథ్యంలో ఫిజికల్డిస్టెన్స్పాటించాల్సి ఉన్నా.. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆ ఆవకాశం లేదు. గనులపై హాజరు వేసుకునే టైమ్నుంచి గనిలోకి దిగేవరకు గుంపులుగానే వెళ్లాల్సి వస్తోంది. ఒకే గనిలో వందల సంఖ్యలో కార్మికులు పని చేస్తారు. బ్లాస్టింగ్చేసే టైమ్నుంచి బొగ్గును పైకి తరలించేవరకు ఒకేచోట ఎక్కువమంది కలిసి ఉంటుంటారు. గనిలోకి దిగే టైమ్లో మ్యాన్రైడింగ్ లో వెళ్లాల్సి ఉంటుంది. అందులో ఒకేసారి 50 మందికి తక్కువ కాకుండా కూర్చుని ప్రయాణిస్తుంటారు. దీంతో కరోనా కేసులు పెరిగే అవకాశం మెండుగా ఉంది.
150 బెడ్స్ తో కరోనా సెంటర్
మందమర్రి రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 1986 నుంచి మందమర్రి, శ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబాలు, రిటైర్మెంట్కార్మిక కుటుంబాలకు సేవలు అందిస్తున్నారు. దీంతోపాటు ఎమర్జెన్సీ టైమ్లో బెల్లంపల్లి ఏరియా సింగరేణియులకు కూడా ఇక్కడే ట్రీట్మెంట్చేస్తున్నారు. సాధారణ సమయాల్లో ప్రతి రోజు సుమారు 1,200 మంది అవుట్పేషెంట్లు ట్రీట్మెంట్ పొందుతారు. 140 బెడ్స్ఉన్న ఈ ఆసుప్రతిలో సుమారు 30 డాక్టర్లు, 200 మంది పైగా పారామెడికల్ఉద్యోగులు పని చేస్తున్నారు. దీనికి అనుబంధంగా మందమర్రిలో కేకే డిస్పెన్సరీ, బి జోన్ డిస్పెన్సరీ, శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 8 డిస్పెన్సరీ పని చేస్తున్నాయి. గత ఏడాది కరోనా నేపథ్యంలో ఆర్కేపీ ఏరియా ఆసుపత్రిలో సింగరేణీయుల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్, క్వారంటైన్సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. సుమారు 70 బెడ్స్ను కరోనా బాధితుల కోసం అందుబాటులో ఉంచారు. కరోనా టెస్టులతో పాటు గతనెల 23 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా చేస్తున్నారు. కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక రూమ్స్ కేటాయించారు. ఇప్పటికే రెండు వార్డులను కరోనా బాధితుల కోసం కేటాయించారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కేసీఈఓ క్లబ్లో క్వారంటైన్ సెంటర్ నడుపుతున్నారు. సింగరేణి డీవైసీఎంవో ఆధ్వర్యంలో నలుగురు సింగరేణి డాక్టర్లు, మరో నలుగురు కాంట్రాక్ట్ డాక్టర్లు కరోనా పేషెంట్లకు సేవలు అందిస్తున్నారు. మిగిలిన డాక్టర్లు సాధారణ రోగులకు వైద్యం అందిస్తున్నారు. కరోనా రెండో దశలో విజృంభిస్తున్న నేపథ్యంలో 30 రోజుల్లో కార్మికులందరికి వ్యాక్సిన్ వేయడం, స్పెషల్కోవిడ్ వార్డుల ఏర్పాటు, క్వారంటైన్ సెంటర్ల లో బెడ్స్ పెంపు, కోవిడ్ర్యాపిడ్టెస్టుల పెంపులో భాగంగా రామకృష్ణాపూర్లోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని పూర్తిస్థాయి కోవిడ్సెంటర్(ఆసుపత్రి)గా మార్చేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా శనివారం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోవిడ్సెంటర్ కోసం డీవైసీఎంవో, డాక్టర్లు, ఆఫీసర్లతో సమీక్ష జరిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని వార్డుల్లో సుమారు 70 బెడ్స్ ఉన్నాయి. వీటి సంఖ్యను 150కు పెంచనున్నారు. ఆసుపత్రితో పాటు ఆర్కేసీఈఓ క్లబ్ క్వారంటైన్సెంటర్లో బెడ్స్ సంఖ్య పెంచనున్నారు. ఇప్పటికే సాధారణ క్యాజువాలిటీని కోవిడ్ క్యాజువాలిటీగా మార్చారు.
