భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో 2026ను కొత్త గనుల సంవత్సరంగా పేర్కొంటూ ఆ దిశగా కొత్త మైన్స్ను ప్రారంభించుకోనున్నామని సింగరేణి కాలరీస్ కంపెనీ డైరెక్టర్ (ప్రాజెక్టు, ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్లో మంగళవారం జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం హెడ్డాఫీస్ నుంచి బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వరకు డైరెక్టర్(ఈఅండ్ఎం) తిరుమల రావుతో కలిసి టార్చ్ రన్ను నిర్వహించి అమరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమిష్టిగా కృషి చేయడంతో పాటు పని గంటలను పూర్తిగా వినియోగించుకుంటేనే ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయగలుగుతామన్నారు. 2047 నాటికి 25గిగావాట్ల పునరుత్పాదక శక్తి ఉత్పత్తి లక్ష్యాన్ని సింగరేణి నిర్దేశించుకుందన్నారు. ఒడిశాలోని నైనీ ప్రాజెక్టు నుంచి త్వరలో బొగ్గు ఉత్పత్తి స్టార్ట్ అవుతొందన్నారు. కొత్తగూడెంలోని వీకే ఓసీతో పాటు ఇల్లెందు, మణుగూరు, శ్రీరాంపూర్ ఏరియాల్లో కొత్త మైన్స్లలో బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.
