రామగుండం రీజియన్‌‌లో ఘనంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలు

రామగుండం రీజియన్‌‌లో ఘనంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలు
  • జెండావిష్కరణ చేసిన జీఎంలు 
  • ఆకట్టుకున్న స్టాళ్ల ప్రదర్శన

గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థ 135వ ఆవిర్భావ దినోత్సవాలు శనివారం రామగుండం రీజియన్‌‌లో ఘనంగా నిర్వహించారు. గోదావరిఖనిలోని జవహర్‌‌లాల్‌‌  నెహ్రూ స్టేడియం, యైటింక్లయిన్‌‌ కాలనీలోని అబ్దుల్‌‌ కలాం స్టేడియం, సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలలో రీజియన్‌‌  జీఎంలు చింతల శ్రీనివాస్‌‌, ఎల్‌వీ సూర్యనారాయణ, సుధాకర్‌‌ రావు.. సింగరేణి జండాలను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు.

అనంతరం సింగరేణి ప్రగతిని వివరించేలా ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను, పుడ్‌‌ కోర్టులను జీఎంలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి కార్మికులు, ఆఫీసర్లు కృషి చేయాలన్నారు. క్రమశిక్షణతో పనిచేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని, ప్రమాదాలు లేని సింగరేణిగా తీర్చిదిద్దాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో సింగరేణి అగ్రగామిగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. కాగా, సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్తమ ఉద్యోగులను జీఎంలు సన్మానించారు.