సింగరేణి జీడీకే 11వ గనిలో మూడో కంటిన్యూయస్ మైనర్..రూ.100 కోట్లతో హైరింగ్ పద్ధతిలో నడిపేందుకు టెండర్లు ఆహ్వానం

సింగరేణి జీడీకే 11వ గనిలో మూడో కంటిన్యూయస్ మైనర్..రూ.100 కోట్లతో హైరింగ్ పద్ధతిలో నడిపేందుకు  టెండర్లు ఆహ్వానం
  •      ఆరు నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం 
  •      రోజుకు అదనంగా వెయ్యి టన్నుల బొగ్గు వెలికితీత 
  •      దేశంలోనే మూడు కంటిన్యూయస్ మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నడిచే గనిగా జీడీకే రికార్డు

గోదావరిఖని, వెలుగు:  సింగరేణి రామగుండం రీజియన్​ పరిధిలోని జీడీకే 11వ గనిలో ఇప్పటికే రెండు కంటిన్యూయస్​ మైనర్(సీఎం) ​మెషిన్లు నడుస్తుండగా, మూడో మెషిన్‌‌‌‌‌‌‌‌ను హైరింగ్​ పద్ధతిలో ప్రవేశపెట్టేందుకు సింగరేణి ముందడుగు వేసింది. ఇందుకోసం రూ.100 కోట్లతో టెండర్లు ఆహ్వానించగా.. పలు ప్రైవేటు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మూడో మెషిన్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసి ఆరు నెలల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేలా సంస్థ చర్యలు తీసుకుంటోంది.

 ఈ మెషిన్​ ద్వారా ప్రతి రోజు అదనంగా వెయ్యి టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేలా ఆఫీసర్లు ప్లాన్​ చేశారు. దేశంలోని బొగ్గు సంస్థలన్నింటిలోనూ మూడో కంటిన్యూయస్​ మైనర్​మెషిన్​ నడిచే మైన్‌‌‌‌‌‌‌‌గా జీడీకే11వ గని రికార్డుల్లోకి ఎక్కబోతోంది. అలాగే సింగరేణి వ్యాప్తంగా అండర్​గ్రౌండ్​మైన్లలో ఏటా ఒక మిలియన్​ టన్నులు సాధించే ఏకైక గనిగా కూడా పేరు తెచ్చుకోబోతోంది. 

తట్టా చెమ్మస్​ నుంచి కంటిన్యూయస్​ మైనర్​ దాకా..

సింగరేణి ఆర్జీ 1 ఏరియాలోని గోదావరిఖని 11వ గనిని 1979లో ఏర్పాటు చేయగా, 1985 నుంచి బొగ్గు వెలికితీయడం ప్రారంభించారు. మొదట్లో ఈ గనిలో తట్టా చెమ్మస్​ (బోడ్​ అండ్​ ఫిల్లర్​) పద్ధతిలో బొగ్గు వెలికితీశారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేసేవారు. 1991 నుంచి 2003 వరకు లాంగ్‌‌‌‌‌‌‌‌ వాల్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టగా, 2002 నుంచి 2020 వరకు బ్లాస్టింగ్​ గ్యాలరీ (బీజీ) పద్ధతిలో బొగ్గు ఉత్పత్తి చేశారు. 2008లో మొట్టమొదటిసారిగా కంటిన్యూయస్​ మైనర్​ మెషిన్​ను ఇంట్రడ్యూస్​ చేశారు. 

మెషిన్‌‌‌‌‌‌‌‌ను ఉన్న పళ్ల యంత్రం నిరంతరం బొగ్గును తొలుస్తూ కింద పడేస్తే అక్కడి నుంచి బెల్ట్​ ద్వారా నిర్దేశించిన ప్లేస్​కు చేర్చుతారు. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతున్నందున దీనిని కంటిన్యూయస్​ మైనర్​మెషిన్‌‌‌‌‌‌‌‌గా పిలుస్తున్నారు. ఆ తర్వాత 2021లో ఇదే గనిలో రెండో కంటిన్యూయస్​ మైనర్​ మెషిన్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. ఈ మెషిన్​ రోజుకు వెయ్యి టన్నుల వరకు బొగ్గును వెలికితీస్తుంది. ఈ రెండు మెషిన్లు సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. తాజాగా హైరింగ్​ పద్ధతిలో మూడో మెషిన్‌‌‌‌‌‌‌‌ను గనిలోకి దింపేందుకు టెండర్​ ప్రక్రియను సింగరేణి ఆహ్వానించింది. 

350 మీటర్ల లోతులో ఉన్న బొగ్గు కోసం..

సాధారణంగా ఓపెన్​ కాస్ట్​ గనుల్లో 300 మీటర్ల లోతు వరకు ఉన్న బొగ్గును బ్లాస్టింగ్​చేసి వెలికితీస్తారు. జీడీకే 11వ గనిలో 350 మీటర్లు ఆపైన లోతులో ఉన్న బొగ్గును వెలికితీయడానికి మూడో కంటిన్యూయస్​ మైనర్ మిషిన్‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టాలని మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ భావిస్తోంది. దీంతో రాబోయే ఏడేండ్లలో ఈ గనిని, ఓపెన్​కాస్ట్​3, ఓపెన్ కాస్ట్​ 5 ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు విలీనం కానున్నాయి. ఈక్రమంలో ఈ గనిలో ఓపెన్​కాస్ట్​ విధానం ద్వారా వెలికితీయలేని లోతుగా ఉన్న బొగ్గు నిల్వలను బయటకు తీసేందుకు మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆరేండ్లపాటు ఈ మిషిన్‌‌‌‌‌‌‌‌ను హైరింగ్​పద్ధతిలో నడపనుంది. 

40 ఏళ్లల్లో వెలికితీసింది 20.50 మి.టన్నులే.. 

జీడీకే 11వ గనిలో మొత్తం 53 మిలియన్​ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ గని ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 40 ఏండ్లలో 20.50 మిలియన్​టన్నుల బొగ్గును మాత్రమే వెలికితీశారు. ఇంకా 32.50 మిలియన్​ టన్నుల బొగ్గును వెలికితీయాల్సి ఉంది. ఏటా మిలియన్​ టన్నుల బొగ్గును వెలికితీయాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగానే మూడో కంటిన్యూయస్​ మైనర్​మెషిన్‌‌‌‌‌‌‌‌ను రంగప్రవేశం చేస్తున్నారు. ఏడేళ్ల వరకు భూగర్భ గనిగా నడిచిన తర్వాత ఓపెన్​కాస్ట్​ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో విలీనం చేయనున్నారు. అప్పుడు మరింత బొగ్గును వెలికితీసే 
వీలు ఏర్పడుతుంది. 

జీడీకే 11వ మైన్‌‌‌‌‌‌‌‌ను లాభాల్లోకి తీసుకువచ్చేందుకే...

సింగరేణిలో అండర్​గ్రౌండ్​మైన్లు అన్నీ దాదాపుగా నష్టాల్లో నడుస్తున్నాయి. ఒక టన్ను బొగ్గు వెలికితీసి అమ్మితే కనీసంగా రూ.6 వేల వరకు నష్టం వస్తోంది. అందుకే భూగర్భ గనుల్లో నష్టాలను తగ్గించాలనే ఆలోచనతో జీడీకే 11వ గనిలో మూడో కంటిన్యూయస్​ మైనర్​ను హైరింగ్​ పద్ధతిలో ప్రవేశపెడుతున్నాం. టెండర్​ప్రక్రియ మొదలైంది. పలు ప్రైవేటు సంస్థలు ఆసక్తిని చూపుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో బొగ్గు ఉత్పత్తి మొదలవుతుంది. -డి.లలిత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్జీ 1 ఏరియా జీఎం