గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో పనిచేస్తున్న ఆఫీసర్లు తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు మేనేజ్మెంట్కు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని, అవసరమైతే సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో నిరసనలు తెలిపితే తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆందోళనలను వాయిదా వేయించిన ఉన్నతాధికారులు.. ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ఇండియా (సీఎంఓఏఐ) సింగరేణి బ్రాంచ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మీపతిగౌడ్, జనరల్సెక్రటరీ పెద్ది నర్సింహులు అన్నారు.
ఆఫీసర్ల వేతనాలలో భాగమైన ‘ఫెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) కోల్ ఇండియాలో చెల్లిస్తున్నప్పటికీ సింగరేణిలో మాత్రం రెండేళ్లుగా అమలు చేయడం లేదన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే 15 నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామని, అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
