మందమర్రి ఏరియాలో ఓసీపీ పబ్లిక్ హియరింగ్కు ఏర్పాట్లు

మందమర్రి ఏరియాలో  ఓసీపీ పబ్లిక్ హియరింగ్కు ఏర్పాట్లు

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ఓపెన్ ​కాస్ట్​ ఫేజ్​2 ఎక్స్​టెన్షన్ ​మైన్ పర్యావరణ పర్మిషన్ కోసం పబ్లిక్​ హియరింగ్​సభ బుధవారం జరగనుంది. ఓసీపీ ఓబీ కాంట్రాక్ట్ ​కంపెనీ క్యాంపు ఆఫీస్​లో జరిగే సభ కోసం సింగరేణి యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా ఏర్పాట్లను మంగళవారం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్​రెడ్డి పరిశీలించారు. 

హియరింగ్ సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ఏసీపీ రవికుమార్​ నేతృత్వంలో ముగ్గురు సీఐలు,ఎనిమిది మంది ఎస్సైలతో పాటు 100 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తామని సీఐ శశిధర్​ రెడ్డి తెలిపారు. నిజామాబాద్​ రీజియన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్​ బోర్డు ఇంజినీర్ల ఆధ్వర్యంలో మంచిర్యాల అడిషనల్​ కలెక్టర్​ చంద్రయ్య నేతృత్వంలో పబ్లిక్ హియరింగ్ ​జరుగనుంది. సింగరేణి కంపెనీకి చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.