సింగరేణిని ప్రమాదరహిత సంస్థగా మార్చాలి

 సింగరేణిని ప్రమాదరహిత సంస్థగా మార్చాలి
  •      గనుల్లో భద్రత పెంపు కోసం పటిష్టమైన చర్యలు
  •     కార్మిక సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకుంటాం
  •     సింగరేణి క్వార్టర్లీ సేఫ్టీ మీటింగ్‌‌‌‌లో సీఎండీ ఎన్‌‌‌‌.బలరాం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : రక్షణ లేని పని ప్రదేశాల్లో డ్యూటీ చేయాలని యాజమాన్యం ఒత్తిడి చేయబోదని, ప్రతి కార్మికుడు స్వీయరక్షణే ముఖ్యమని గ్రహించాలని సింగరేణి సీఎండీ బలరాం చెప్పారు. నిర్లక్ష్యం వల్లే సింగరేణిలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం జనరల్‌‌‌‌ సెక్రటరీ వి.సీతారామయ్య అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లో క్వార్టర్లీ సేఫ్టీ మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. 

సమావేశానికి సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల ప్రతినిధులు, డైరెక్టర్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ మైన్స్‌‌‌‌ సేఫ్టీ ఆఫీసర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ కార్మిక సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకొని గనుల్లో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సింగరేణిని ప్రమాదరహిత కంపెనీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. 

అనంతరం గనుల్లో రక్షణ పెంపు కోసం కార్మిక సంఘాల లీడర్లు పలు సూచనలు చేశారు. నాణ్యమైన హెల్మెట్లు బూట్లు సరఫరా చేయాలని, వైద్య సేవలు పెంచడంతో పాటు క్యాంటీన్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే కొత్త యంత్రాల కొనుగోలు, ఆధునికీకరణ, అవసరమైన సిబ్బంది నియామకం వంటి అంశాలపై సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌‌‌‌ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్‌‌‌‌టీయూసీ సెక్రటరీ జనరల్‌‌‌‌ జనక్‌‌‌‌ప్రసాద్‌‌‌‌ పలు సూచనలు చేశారు. 

అలాగే ఇటీవల పలు ప్రమాదాల్లో చనిపోయిన కార్మికులకు సంతాపం ప్రకటించారు. అనంతరం సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణ, ఎన్‌‌‌‌వీకే. శ్రీనివాస్, జి.వెంకటేశ్వర్‌‌‌‌రెడ్డి, డీజీఎం సేఫ్టీ జ్ఞాన సుందరం, జీఎం సేఫ్టీ గురవయ్యతో పాటు అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జనరల్‌‌‌‌ మేనేజర్లు పాల్గొన్నారు.