కాంగ్రెస్​తోనే సింగరేణి మనుగడ

కాంగ్రెస్​తోనే సింగరేణి మనుగడ
  • వంశీకృష్ణను భారీ మోజార్టీతో గెలిపించాలె
  • ఐఎన్టీయూసీ నేత జనక్​ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో కొత్త బొగ్గు గనుల కోసం కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర మినిమం వేజెస్​ అడ్వయిజరీ బోర్డు చైర్మన్​ బి.జనక్​ ప్రసాద్​అన్నారు. మందమర్రిలోని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను కోల్​బెల్ట్​ ప్రాంతంలోని సింగరేణి కార్మిక కుటుంబాలు భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు.

కార్మికులకు కాంగ్రెస్ ​సర్కార్​ అండగా ఉంటుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలు ఏనాడూ కార్మికులను పట్టించుకోలేదన్నారు. దేశవ్యాప్తంగా 72 సెక్టార్లలో పనిచేసే అసంఘటిత కార్మికుల  వేతనాలు 11 ఏండ్లుగా పెరగలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా హైపవర్​కమిటీ సూచించిన వేతనాలు సింగరేణి కాంట్రాక్ట్​కార్మికులకు అందడంలేదన్నారు. కార్మిక రంగానికి జనక్​ప్రసాద్ అందిస్తున్న సేవలను గుర్తించిన సీఎం రేవంత్​ రెడ్డి ఆయనకు స్టేట్​ మినిమం వేజెస్ అడ్వయిజరీ బోర్డు చైర్మన్​ బాధ్యతలు అప్పగించారని మంచిర్యాల జడ్పీ చైర్​పర్సన్​నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు.

కార్మిక రంగం అభ్యున్నతికి మరింత సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి, నల్లాల ఓదెలు ఆధ్వర్యంలో కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాలు, ఇతర సంఘాల బాధ్యులు జనక్​ ప్రసాద్​ను ఘనంగా సన్మానించారు. సమావేశంలో కాంగ్రెస్ నేత దుర్గం నరేశ్, ఐఎన్టీయూసీ లీడర్లు కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, నరేందర్, మిట్ట సూర్యనారాయణ, పూల్లూరి లక్ష్మణ్, మేడ సమ్మయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.