సింగరేణి ఆఫీసర్లు, ఉద్యోగులకు .. కొత్త క్వార్టర్లు .. డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ పద్ధతితో నిర్మాణం

సింగరేణి ఆఫీసర్లు, ఉద్యోగులకు .. కొత్త క్వార్టర్లు .. డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ పద్ధతితో నిర్మాణం
  • 1,003 క్వార్టర్ల నిర్మాణానికి మేనేజ్ మెంట్ నిర్ణయం 
  • శిథిలావస్థకు చేరిన వాటిస్థానంలో కొత్త క్వార్టర్లు 
  • గోదావరిఖని, శ్రీరాంపూర్, భూపాలపల్లి, మణుగూరు ప్రాంతాల్లో ఏర్పాటు 
  • రూ.450 కోట్లు కేటాయిస్తూ  బోర్డు అప్రూవల్​

గోదావరిఖని, వెలుగు : ఉద్యోగులు, ఆఫీసర్లు ఉండేందుకు కొత్తగా డబుల్, త్రిబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లను కట్టించేందుకు సింగరేణి నిర్ణయించింది. వీటిని గోదావరిఖని, శ్రీరాంపూర్​, భూపాలపల్లి, మణుగూర్​ ప్రాంతాల్లో 1,003 క్వార్టర్లను నిర్మించనుంది.  వీటిలో 143 క్వార్టర్లు ఆఫీసర్లకు, ఉద్యోగులకు 860 క్వార్టర్లను కేటాయించనుంది. ఇందుకు రూ.450 కోట్లకు డైరెక్టర్ల బోర్డు అప్రూవల్​ ఇచ్చింది.  కొత్తగా నిర్మాణం చేసే క్వార్టర్లను బ్లాక్​ల వారీగా చేపట్టనుంది.  

ఆఫీసర్లకు త్రిబుల్, ఉద్యోగులకు డబుల్​ బెడ్​ రూమ్​లు వచ్చేలా బ్లాక్​ల వారీగా జి+1 విధానంలో నిర్మించనుంది. ఆఫీసర్లకు 'మిలీనియం​ -ఏ' బ్లాక్​ పద్ధలో 35 క్వార్టర్లు,  ‘మిలీనియం బి' బ్లాక్​ పద్ధతిలో 108 క్వార్టర్లు ఖరారు చేసింది. ఉద్యోగులలో సూపర్ ​వైజర్​ క్యాడర్​కు 'మిలీనియం​- సి' బ్లాక్​పద్ధతిలో 300 క్వార్టర్లు, వర్క్​మెన్ల కోసం 'మిలీనియం​ - డి' బ్లాక్​ పద్ధతిలో 560 క్వార్టర్ల నిర్మాణం చేపట్టనుంది.  ప్రతి బ్లాక్​లో నివసించే వారికోసం గ్రౌండ్​ఫ్లోర్​లో పార్కింగ్​ సౌకర్యం కల్పించనుంది. 

శిథిలావస్థకు చేరగా.. 

సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల కోసం  50 ఏండ్ల కింద రేకులతో క్వార్టర్లను నిర్మించింది. ఒక హాల్, సింగిల్​బెడ్​రూమ్, కిచెన్ ఉండే క్వార్టర్లలోనే కార్మిక కుటుంబాలు నివసిస్తుండగా.. పిల్లలు ఎదగడంతో స్థలం సరిపోక అదనంగా క్వార్టర్​కు ఆనుకుని షెడ్లను నిర్మించారు. కార్మికులు రిటైర్డ్​ అయిన తర్వాత వాటికి రిపేర్లు చేయిస్తూ కొత్తగా వచ్చే వారికి కేటాయిస్తున్నారు. ప్రస్తుతం క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకుని, నివాసానికి అనుకూలంగా లేవు.  వాటి రిపేర్లకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తున్నదని మేనేజ్​మెంట్​భావించింది. దీంతో పలు ఏరియాల్లో పాత క్వార్టర్లను తొలగించి కొత్తగా డబుల్, త్రిబుల్​బెడ్​రూమ్​క్వార్టర్లను నిర్మించేందుకు  సింగరేణి మేనేజ్​మెంట్​నిర్ణయించింది.  

వివిధ ఏరియాల్లో నిర్మాణాలు ఇలా 

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆఫీసర్లకు 36 క్వార్టర్లు ఉద్యోగులకు 282 క్వార్టర్లు నిర్మించనుంది. ఇందుకు రూ.133 కోట్లు, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​లో ఆఫీసర్లకు 39 క్వార్టర్లు , ఉద్యోగులకు 410 క్వార్టర్లు  రూ.193 కోట్లు ఖర్చు చేయనుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆఫీసర్లకు 22 క్వార్టర్లు, ఉద్యోగులకు 60 క్వార్టర్లకు రూ.45 కోట్లు, ఖమ్మం జిల్లా మణుగూరులో ఆఫీసర్లకు 46 క్వార్టర్లు, ఉద్యోగులకు 108 క్వార్టర్ల నిర్మాణానికి రూ.79 కోట్లు కేటాయించనుంది. ప్రస్తుతం వీటి నిర్మాణానికి టెండర్​ప్రక్రియ జరుగుతుంది.