
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి యాజమాన్యం కొత్తగా రూపొందించిన ట్రాన్స్ఫర్స్ గైడ్ లైన్స్పై కార్మికులు, సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఈ గైడ్ లైన్స్ను జూన్ మొదటి వారం నుంచి అమలు చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. కంపెనీలో జనవరి నుంచి మే 31 వరకు ఐదు నెలలుగా కార్మికుల ట్రాన్స్ఫర్స్పై యాజమాన్యం నిషేధం విధించింది. జూన్ నుంచి ట్రాన్స్ ఫర్స్ అవుతాయని ఎదురుచూస్తున్న తమ ఆశలపై కొత్త నిబంధనలు నీళ్లు పోస్తున్నాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి ట్రాన్స్ ఫర్స్ దరఖాస్తులన్నీ ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఫోకల్ పాయింట్స్లలో ఉన్న వారిని నాన్ ఫోకల్ పాయింట్స్కు ట్రాన్స్ఫర్ చేయాలనే నిబంధనను పక్కాగా అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. పర్చేజ్, కోల్బ్రాంచ్, స్టోర్స్, రిక్రూట్మెంట్సెల్, అకౌంట్స్ లాంటి కీలక పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులు నాలుగేండ్లు సర్వీస్ పూర్తి అయితే ట్రాన్స్ ఫర్స్చేయడం, ఈ కీలక పోస్టుల్లో ఇప్పటికే పనిచేసిన వారిని తిరిగి అదే పోస్టుల్లోకి బదిలీ చేయడంపై యాజమాన్యం నిషేధం విధించింది.
తన సర్వీస్లో కేవలం రెండు సార్లు మాత్రమే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్కు అవకాశ ఉండడం, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్కు పదేండ్ల సర్వీస్ సంబంధిత ఏరియాలో పనిచేసిన అనుభవం ఉండకూడదన్న నిబంధనలపై కార్మికులతోపాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్, హెచ్ఎమ్మెస్ సంఘాల నేతలు మండి పడుతున్నారు. నిబంధనలపై గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ప్రతినిధులతో కనీసం చర్చించకుండా ఏకపక్షంగా యాజమాన్యం అమలు చేసేందుకు ముందుకు రావడం పట్ల అసహనం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు.