- నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్
హాలియా, వెలుగు: సర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, పెండింగ్లో ఉన్న మ్యాపింగ్ను వెంటనే ముగించాలని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ బీఎల్ఓలను ఆదేశించారు. బుధవారం నాగార్జునసాగర్ (నందికొండ) మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో బీఎల్ఓలు చేపడుతున్న సర్ ప్రక్రియను ఆయన పరిశీలించి మాట్లాడారు.
ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చూడాలని, మరణించిన వారి ఓట్లను మరణ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా తొలగించాలని సూచించారు. అనంతరం నాగార్జునసాగర్లోని కమలా నెహ్రూ ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.
డెలివరీ కోసం వచ్చే గర్భిణులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ మానస స్వర్ణ సుమన్ ఉన్నారు.
