- సీఆర్పీఎఫ్ బందోబస్తు మధ్య పరిశీలన
- షాద్నగర్ పోలీస్స్టేషన్ పరిసరాల తనిఖీ
షాద్నగర్/శంషాబాద్, వెలుగు: దిశ అత్యాచారం, హత్య, నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణ చివరి దశకు వచ్చింది. ఘటన జరిగిన చటాన్పల్లి బ్రిడ్జి, నిందితులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశాలను కమిషన్ ఆదివారం భారీ బందోబస్తు మధ్య పరిశీలించింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ సిర్పూర్కర్, సభ్యులు జస్టిస్ రేఖ, మాజీ డీజీపీ కార్తికేయ, సిట్అధికారి రాచకొండ సీపీ మహేశ్ భగవత్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తదితరులు 18 వెహికల్స్ కాన్వాయ్లో సీఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు మధ్య అక్కడకు వెళ్లారు. దిశ ఘటన, నిందితుల ఎన్కౌంటర్ తీరు, ఎన్కౌంటర్కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 40 నిమిషాల పాటు అక్కడే దర్యాప్తు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సభ్యులను కలిసేందుకు ప్రజా సంఘాల నేతలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఘటనా స్థలం నుంచి షాద్నగర్ పోలీస్ స్టేషన్కు కమిషన్ సభ్యులు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. అక్కడ కూడా స్థానికులు, ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. విచారణ నివేదికను వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ అందజేయనుంది.
కమిషన్ సభ్యులను కలిసిన దిశ తండ్రి
దిశ బైకు ఆపిన తొండుపల్లి గేట్ వద్ద కమిషన్ సభ్యులు విచారణ చేస్తున్న సమయంలో దిశ తండ్రి అక్కడకు వెళ్లారు. కమిషన్ సభ్యులను కలిసి కాసేపు మాట్లాడారు. న్యాయం జరుగుతుందని కమిషన్ సభ్యులు హామీ ఇచ్చినట్టు ఆయన చెప్పారు. 2019 నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు యువకులు చటాన్పల్లి వద్ద అత్యాచారం చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకు అదే ఏడాది డిసెంబర్ 6న దిశ ఘటన జరిగిన స్థలంలోనే నిందితులు ఎన్కౌంటర్లో చనిపోయారు. అది బూటకపు ఎన్కౌంటర్ అని పేర్కొంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఎన్కౌంటర్పై సమగ్ర దర్యాప్తు కోసం సిర్పూర్కర్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఎన్కౌంటర్లో పాల్గొన్న అధికారులందరినీ కమిషన్ విచారించింది.