
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు సిట్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. నేరస్తుడిగా ప్రకటించే క్రమంలో కేసు విచారణ జరుగుతున్న నాంపల్లి కోర్టు, రామ్దేవ్గూడ ఇబ్రహీంబాగ్ తారామతి బారాదరి సమీపంలోని ప్రభాకర్ రావు విల్లాకు సిట్ అధికారులు నోటీసులు అతికించారు. ఈ విషయంపై ఆయనకు ఆన్లైన్లో సమాచారం అందించారు. నోటీసుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా జూన్ 20 లోగా నాంపల్లిలోని 14వ చీఫ్ అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఈనెల 29న విచారణకు రానుంది. సిట్ అధికారులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. హైకోర్టు జడ్జీలు, ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రముఖులు సహా సామాజికవేత్తల ఫోన్లను నిందితుడు ట్యాప్ చేశాడని వివరించారు. కేసు తీవ్రత నేపథ్యంలో నిందితుడిని తప్పనిసరిగా విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.