
ఏపీ లిక్కర్ కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. సిట్ అధికారులు బుధవారం (జులై 30) హైదరాబాద్ లో పలు చోట్ల సోదాలు నిర్వహించారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో A- 40 గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు.. సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్ హౌస్ లో భారీగా నగదు దాచినట్లు తెలుసుకున్న అధికారులు.. ఫామ్ హౌజ్ లో సోదాలు నిర్వహించారు. పెట్టెల్లో భారీ ఎత్తున దాచిన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో A 1 గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, చాణక్య 12 పెట్టె్ల్లో రూ.11 కోట్లు దాచినట్టు అంగీకరించారు.
ఈ గెస్ట్ హౌస్ సులోచన ఫార్మ్స్, ప్రొఫెసర్ తగల బాల్ రెడ్డి పేరు మీద ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తంచారు. 2024 జూన్ లో ఈ మొత్తాన్ని దాచినట్టు పేర్కొన్నారు. మొత్తం రూ.11 కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు.
రాజ్ కెసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ రూ.11 కోట్ల నగదు ఉన్న 12 అట్ట పెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్టు సిట్ అధికారులు గర్తించారు. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్కి చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది.