బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’ (Dhurandhar). ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ మూవీ (2025 డిసెంబర్ 5న) రిలీజై దుమ్మురేపే వసూళ్లు కలెక్ట్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల నెట్ మార్కును దాటి, ధురంధర్ అద్భుతమైన ఓపెనింగ్ అందుకుంది. అదే ఊపును కొనసాగిస్తూ వీకెండ్ పూర్తయ్యేసరికి ఇండియా వైడ్గా రూ.207.25 కోట్లకి పైగా నెట్ వసూలు చేసింది. ఓవర్సీస్లో సైతం మంచి కలెక్షన్స్ రాబడుతోంది.
ఈ క్రమంలోనే ‘ధురంధర్’ మూవీ ఆరు గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేసినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. పాకిస్థాన్కు వ్యతిరేకంగా మూవీని తెరకెక్కించడం వల్లే బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాతో పాటు UAE వంటి దేశాల్లో నిషేధించబడిందని సినీ వర్గాల్లో టాక్ ఉంది.
నివేదికల ప్రకారం, బాలీవుడ్కు కీలక మార్కెట్ అయిన గల్ఫ్లోని అన్ని థియేటర్లలో దీన్ని విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నించారు. అయితే అన్నిచోట్ల అనుమతులు లభించలేదు. ఈ క్రమంలో కొన్ని థియేటర్స్కు మాత్రమే పరిమితం చేశారు. అయినప్పటికీ బ్యాన్ చేశారు. గల్ఫ్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, ధురంధర్ స్వదేశంలో బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధిస్తోంది. గల్ఫ్ మార్కెట్ను మినహాయించి విదేశాలలో రూ. 44.5 కోట్లు సంపాదించింది.
గతంలో, ఫైటర్, స్కై ఫోర్స్, ది డిప్లొమాట్, ఆర్టికల్ 370, టైగర్ 3 మరియు ది కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలు కూడా మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో ఇలాంటి ఆంక్షలను ఎదుర్కొన్నాయి. ప్రారంభంలో యుఎఇలో విడుదలైన ఫైటర్ కూడా ఒక రోజులోనే తీసివేయబడింది.
ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సెన్సార్ ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. పద్దెనిమిదేళ్లు నిండిన వాళ్లు మాత్రమే చూడాలన్నమాట. ఈ మూవీ అత్యంత భారీ రన్టైమ్తో 3.34 గంటలతో వచ్చిన కూడా ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేస్తుందని టాక్ వచ్చింది. 2008లో వచ్చిన ‘జోథా అక్బర్’ నిడివి 3.50 గంటలు కాగా, 17 ఏళ్ల తర్వాత అత్యధిక నిడివితో ఈ సినిమా తెరకెక్కడం విశేషం.
కథ:
1999లో జరిగిన ఐసి–814 విమాన హైజాక్, ఆ తర్వాత 2001లో భారత పార్లమెంట్పై జరిగిన దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. పాకిస్థాన్ టెర్రరిస్ట్ నెట్వర్క్ను అంతం చేయడానికి ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) ఓ యువకుడిని రంగంలోకి దింపుతాడు. అతనే పంజాబ్లో జైలు జీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని భారత ఏజెంట్గా హమ్జా (రణ్వీర్ సింగ్) అనే మారుపేరుతో పాక్లోకి పంపుతాడు.
అక్కడ అతను ఎలాంటి పోరాటం చేశాడు? ఎదురైన సవాళ్లేంటి? కరాచీ అండర్ వరల్డ్ మాఫియా రెహమాన్ బలోచ్ (అక్షయ్ ఖన్నా)ని ఎలా అంతం చేశాడన్నది మూవీ మెయిన్ కాన్సెప్ట్. దీనికితోడు ఇందులో సంజయ్దత్, అర్జున్ రాంపాల్ పాత్రలు ఏంటనేది సస్పెన్స్. ఇకపోతే.. ఈ మూవీ మేజర్ మోహిత్ శర్మ లైఫ్ స్టోరీ ఇదని ప్రచారం జరగగా, ఇది ఎవరి బయోపిక్ కాదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
దాదాపు ఏడాది విరామం తర్వాత వెండితెరపైకి వచ్చిన రణ్వీర్, ఇందులో మునుపెన్నడూ చూడని క్రూరమైన, తీవ్రమైన అవతార్లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. రణ్వీర్ను గుర్తుపట్టలేనంతటి భయంకరమైన లుక్తో ఆకట్టుకున్నారు. ఆయనలోని అపారమైన శక్తి, తీవ్రత క్షణాల్లోనే ఈ గ్రిట్టీ యాక్షన్ డ్రామాకు టోన్ సెట్ చేశాయి. రణ్వీర్ సింగ్ మేకోవర్ చూసి అభిమానులు షాక్ అయ్యారు. దేశంలో అత్యంత శక్తివంతమైన నటులలో ఒకరిగా అతని స్థానాన్ని ఈ మూవీ మరోసారి నిరూపించిందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

