-
ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగురు ఎమ్మెల్సీలు.. త్వరలో ఇవి ఖాళీ
-
మళ్లీ ఒక గ్రాడ్యుయేట్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: శాసన మండలిలో అడుగుపెట్టే అవకాశం ఆరుగురికి దక్కనుంది. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇప్పటికే ఖాళీగా ఉండగా, నలుగురు ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిని ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో వారం రోజుల్లోగా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. గవర్నర్ కోటాలో కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను కేసీఆర్ ప్రభుత్వం సిఫార్సు చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపినా.. ఆ ప్రతిపాదన పక్కకు వెళ్లింది. ఈలోపే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆ రెండు సీట్లు ఖాళీగానే ఉన్నాయి.
గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఈ 2సీట్లు కొత్తగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసే వాళ్లు దక్కించుకోనున్నారు. మిగతా నాలుగు స్థానాల్లో కాంగ్రెస్కు ఇప్పటికిప్పుడు ఒక్క సీటు దక్కనుంది. ఒకటి బీఆర్ఎస్ఖాతాలో చేరనుండగా మిగతా 2సీట్లకు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎమ్మెల్యేలుగా గెలిచి రాజీనామా..
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్ నుంచి, పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి గెలిచారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి విజయం సాధించారు. ఇదే జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుళ్ల దామోదర్రెడ్డి కొడుకు రాజేశ్రెడ్డి నాగర్కర్నూల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కూచుకుళ్ల ఎమ్మెల్సీ పదవికి ఢోకా లేదు. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కడియం, కౌశిక్, కసిరెడ్డి, పల్లా మరో ఐదు రోజుల్లోపే తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న స్థానాలకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించే కేబినెట్భేటీలో ఇద్దరు పేర్లు ఎంపిక చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు. పల్లా ఖాళీ చేసే గ్రాడ్యుయేట్స్, కసిరెడ్డి ఖాళీ చేసే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవులకు నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతుండగా అసెంబ్లీలో సంఖ్యా బలం దృష్ట్యా ఒక సీటు కాంగ్రెస్ కు, రెండో సీటు బీఆర్ఎస్కు దక్కనుంది. ఒకవేళ కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను పోటీకి దించితే ఎన్నిక అనివార్యం అవుతుంది.
ఎవరికి అవకాశం?
కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్, కమ్యూనిస్టులు, జాగో తెలంగాణ పేరుతో రిటైర్డ్ ఐఏఎస్ఆకునూరి మురళీ, తీన్మార్ మల్లన్న సహా పలు ప్రజా సంఘాల నాయకులు పోరాటం చేశారు. సీపీఐ, టీజేఎస్తో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అవగాహన కుదుర్చుకుంది. సీపీఐకి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని మాట ఇచ్చింది. ఈ నేపథ్యంలో గవర్నర్కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి ఇవ్వొచ్చనే చర్చ మొదలైంది. ప్రొఫెసర్ కోదండరామ్కు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళీకి గవర్నర్కోటాలో ఎమ్మెల్సీగా చాన్స్దక్కొచ్చని ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్అలీ, ఫిరోజ్ఖాన్ లో ఒకరికి ఇప్పుడు.. మరొకరికి తర్వాత ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఖాతా తెరువ లేదు.. ఈ నేపథ్యంలో మధుయాష్కీ గౌడ్, మైనంపల్లి హన్మంత రావు, అంజన్కుమార్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సీనియర్ నేత జానారెడ్డికి ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తున్నది.
2025 మార్చి వరకు మళ్లీ ఖాళీలు లేవు
నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ టికెట్ఇవ్వడం ఖాయమని చెప్తున్నారు. కాంగ్రెస్లో చేరిన తీన్మార్ మల్లన్న 18 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అన్ని చోట్ల కాంగ్రెస్ గెలిచింది. దీంతో అవసరమైతే మల్లన్నకు ఎమ్మెల్యే కోటాలో కూడా చాన్స్ఇవ్వొచ్చనే ప్రచారం సాగుతున్నది. సీపీఐకి ఇచ్చే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీటు గవర్నర్ కోటాలో కోరుతున్నారు. ఈ ఆరు సీట్లు తప్ప కౌన్సిల్లో 2025 మార్చిలోపు ఖాళీ అయ్యే సీట్లు లేవు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీట్ల కోసం పట్టుబడుతున్న నేతలందరినీ సంతృప్తి పరచాల్సి ఉంది. కాంగ్రెస్కు అండగా నిలిచిన మేధావులు, ప్రజా సంఘాల లీడర్లను ఇతరత్రా సర్దుబాటు చేయాల్సి ఉంది.