
- నిజామాబాద్ జిల్లాలో రోడ్పై నిలిచి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, ఇద్దరు మృతి
- వనపర్తి జిల్లాలో బస్సు, బైక్ ఢీకొని ఇద్దరు... నిర్మల్ జిల్లాలో మరో ఇద్దరు..
నిజామాబాద్, వెలుగు : రోడ్డుపై నిలిచి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం నిజామాబాద్ శివారులోని శ్రీనగర్ గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. మాక్లూర్ మండలం చిక్లీ గ్రామానికి చెందిన దండ్ల వంశీ (18) నిజామాబాద్లోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. ఆ పని మానేసి డీజే షాప్ పెట్టుకునే ఆలోచనలో ఉన్నాడు. ఈ విషయాన్ని తన ఫ్రెండ్, నగరంలోని కుమార్గల్లీకి చెందిన వంగరి రాజేశ్ (19)కు చెప్పి తన తల్లి గంగామణిని ఒప్పించాలని కోరాడు. రాజేశ్ తన మిత్రుడు ఆకాశ్కు ఫోన్ చేసి రెంట్ కారు తీసుకొని రావాలని చెప్పాడు. ముగ్గురూ కలిసి మంగళవారం సాయంత్రం చిక్లీ గ్రామానికి వెళ్లి షాప్ విషయమై గంగామణితో మాట్లాడారు.
తర్వాత ముగ్గురు కలిసి నిజామాబాద్కు వచ్చి రాత్రి పార్టీ చేసుకున్నారు. రాత్రి మొత్తం కారులోనే అటు ఇటూ తిరిగి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు చిక్లీ గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో నిజామాబాద్ శివారులోని శ్రీనగర్ గ్రామానికి సమీపంలో గజానంద్ రైస్ మిల్ ఎదుట రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో దండ్ల వంశీ, రాజేశ్ అక్కడికక్కడే చనిపోగా, డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆకాశ్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై ఆరీఫ్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన ఆకాశ్ను జీజీహెచ్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రమాదానికి రోడ్డుపైన ఆగిఉన్న లారే కారణం అంటూ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బస్సు, బైక్ ఢీకొని ఇద్దరు..
ఖిల్లాగణపురం, వెలుగు : వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్డు వద్ద బస్సు, బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోయ అశోక్(23), బోయ చందు (22) బైక్పై వనపర్తికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పామిరెడ్డిపల్లి స్టేజీ వద్దకు రాగానే వనపర్తి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొట్టారు. దీంతో అశోక్, చందు ఇద్దరూ స్పాట్లోనే చనిపోయారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు బస్సు అద్దాలను ధ్వంసం చేసి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై శివకుమార్ ఘటనాస్థలానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.