జియో ఫిజికల్​ టెస్టుల తర్వాతే ఎస్​ఎల్​బీసీ పనులు చేపట్టాలి..టెక్నికల్​ సబ్​ కమిటీ సూచనలు

జియో ఫిజికల్​ టెస్టుల తర్వాతే ఎస్​ఎల్​బీసీ పనులు చేపట్టాలి..టెక్నికల్​ సబ్​ కమిటీ సూచనలు
  • ఎన్​జీఆర్​ఐతో టెస్టులు చేయించాలని నిర్ణయం

హైదరాబాద్​, వెలుగు: శ్రీశైలం లెఫ్ట్​ బ్యాంక్​ కెనాల్​ (ఎస్​ఎల్​బీసీ) పనులను జియో ఫిజికల్​ టెస్టులు చేసిన తర్వాతే చేపట్టాలని  టెక్నికల్​ సబ్​ కమిటీ స్పష్టం చేసింది. నేషనల్​ జియాలాజికల్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ (ఎన్​జీఆర్​ఐ) ద్వారా ఈ టెస్టులను చేయించనున్నారు. ఓ వైపు సహాయ చర్యలు చేపడుతూనే రెండు మూడు నెలల్లో జియోఫిజికల్​ టెస్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు. శుక్రవారం హైదరాబాద్​లోని జలసౌధలో టెక్నికల్​ సబ్​ కమిటీ సమావేశం జరిగింది. 

కన్వీనర్​, నల్గొండ సీఈ అజయ్​ కుమార్​ అధ్యక్షతన నిర్వహించిన ఈ భేటీలో ఇరిగేషన్​ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్​ దాస్​, ఈఎన్సీ అనిల్​ కుమార్​, రాక్​ మెకానిక్స్​ నిపుణుడు నైతాని, సొరంగాల తవ్వకాల్లో ఎక్స్​పర్ట్​ మోరె రాములు, ఎన్​జీఆర్​ఐ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బార్డర్​ రోడ్​ ఆర్గనైజేషన్​ నుంచి కల్నల్​ పరీక్షిత్​ మెహ్రా ఆన్​లైన్​లో సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న టన్నెల్​ 14వ కిలోమీటర్​ వద్ద పైకప్పు కూలడంతో 8 మంది అందులో చిక్కుకుపోయారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో ఆరుగురి ఆచూకీ కనుగొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే గత నెలలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.

 జియోఫిజికల్​ డేటా, ఇతర అంశాలను స్టడీ చేసేందుకు ఆ కమిటీ సబ్​ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా నిర్వహించిన సబ్​ కమిటీ భేటీలో.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో టన్నెల్​ బోరింగ్​ మెషీన్​ (టీబీఎం) ద్వారా తవ్వకాలు చేపట్టడం కష్టమని సబ్​ కమిటీ నిపుణులు తేల్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే డ్రిల్లింగ్​, బ్లాస్టింగ్​తోనే టన్నెల్​ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో భూమిపై నుంచి ప్రత్యేక మార్గం (షాఫ్ట్​) నిర్మాణానికి పర్యావరణ అనుమతులు క్లిష్టమవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తం కాగా.. సొరంగ మార్గంలోనే నిర్మాణ వ్యర్థాలను వెనక్కి తరలించేందుకు నిర్మాణ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది.  

20 మీటర్ల పొడవు, 30 మీటర్ల ఎత్తుతో దశలవారీగా బ్లాస్టింగ్​ చేయాల్సి ఉంటుందని.. దానికి తగ్గట్టు జియోఫిజికల్​ డేటాను తీసుకోవాల్సి ఉంటుందని సబ్​ కమిటీ సూచించినట్టు సమాచారం. కాగా, మిగిలిన ఆరుగురి ఆచూకీ కనుగొనేందుకు.. ఒకేసారి శిథిలాలను తొలగిస్తే ప్రమాదమని, కూలిన ప్రాంతంలో ఒక చివరి నుంచి కొంత, మధ్య నుంచి కొంత కొంత తవ్వకాలు చేపడుతూ ముందుకు వెళ్తే బాగుంటుందని రాక్​ మెకానిక్స్​ నైతాని సూచించినట్టు సమాచారం.