
- పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీ
- ఉడాన్తో మరిన్ని విమానాల రాక
న్యూఢిల్లీ: భారతదేశంలోని చిన్న విమానాశ్రయాలు బిజీబిజీగా మారుతున్నాయి. ఉడాన్ వంటి పథకాల కారణంగా ప్రాంతీయ కనెక్టివిటీ పెరుగుతున్నది. దీంతో చిన్న నగరాలకు కూడా భారీగా విమానాలు వస్తున్నాయి. కరోనా అనంతరం వీటికి ట్రాఫిక్ మరింత ఎక్కువయింది. చిన్న పట్టణాల్లో, నగరాల్లో 2018 ఆర్థిక సంవత్సరం వరకు 29 విమానాశ్రయాలు ఉన్నాయి. వీటి నుంచి ఏటా లక్ష మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించేవారు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 52కి పెరిగింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) డేటా ప్రకారం.. కొల్హాపూర్, హుబ్లీ, దర్భంగా, గయా వంటి విమానాశ్రయాలలో లక్ష మంది కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపర్చడానికి ప్రభుత్వ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఉడాన్) పథకం మొదలుపెట్టింది. దీని కింద బీహార్లోని దర్భంగాలో ఏర్పాటైన విమానాశ్రయం 2023 ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. కీలకమైన మెట్రోలకు కనెక్టివిటీని అందిస్తూ 2020లో ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ విమానాశ్రయం ట్రాఫిక్12 రెట్లు పెరిగింది. ఇక్కడి నుంచి 2023 ఆర్థిక సంవత్సరంలో 571,067 మంది ప్రయాణించారు. 2018 ఆర్థిక సంవత్సరంలో 45,847 మంది ప్రయాణించారు. ఈశాన్య ప్రాంతంలోని మేఘాలయలోని షిల్లాంగ్ విమానాశ్రయానికి ఈ కాలంలో ప్రయాణీకుల సంఖ్య 12,957 నుండి 109,788కి పెరిగింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ విమానాశ్రయం నుంచి 2018 ఆర్థిక సంవత్సరంలో కేవలం 14 మంది ప్రయాణీకులు వెళ్లారు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 1.28 లక్షలు దాటింది. రిపేర్ల కోసం 2018 ఆర్థిక సంవత్సరంలో చాలా రోజులపాటు ఈ విమానాశ్రయాన్ని మూసివేశారు. 2019 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి. 1974లో కార్యకలాపాలు మొదలైన కర్నాటకలోని హుబ్లీ విమానాశ్రయానికి ట్రాఫిక్ 49,227 మంది నుండి 322,701 మంది ప్రయాణీకులకు పెరిగింది. ఉడాన్ కారణంగా దీనికి మరిన్ని ఎక్కువ విమానాలు వస్తున్నాయి. ఈ పథకం వల్ల అనేక కొత్త విమానాశ్రయాలు ఏర్పాటయ్యాయి.
కరోనా కూడా కారణమే..
మహమ్మారి కారణంగా చాలా మంది సాధారణ ట్రాన్స్పోర్టుకు బదులు ఎయిర్ ట్రాఫిక్కు మారారు. “కరోనా సమయంలో బస్సు, రైలు సేవలు పరిమితం కావడం వల్ల చాలా మంది కరోనా సమయంలో మొదటిసారిగా విమానాలకు మారారు. కొత్త విమానాశ్రయాలు రావడం కూడా ప్రయాణీకుల వృద్ధికి దోహదపడింది" అని ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. 2018 – 2023 మధ్య, యాక్టివ్ డొమెస్టిక్ ఎయిర్పోర్టుల సంఖ్య 86 నుండి 128కి.. అంటే 49శాతం పెరిగింది. "ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటు, వాటి సామర్థ్యాన్ని పెంపొందించడం వలన ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుంది. ఇవి కనెక్ట్ చేసే రీజనల్ హబ్స్ను కూడా మెరుగుపరచాలి. ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్టుల టెర్మినల్స్లో విపరీతంగా రద్దీ ఉంటోంది. ప్రతి అదనపు ప్రాంతీయ విమానాశ్రయానికి, దాని హబ్ విమానాశ్రయం సామర్థ్యం 20శాతం పెరగాలి. ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రద్దీ కారణంగా ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్టుల ప్యాసింజర్లకు ఇబ్బంది అవుతోంది " అని మార్టిన్ కన్సల్టింగ్ సీఈఓ మార్క్ మార్టిన్ అన్నారు. ఎయిర్ట్రాఫిక్ ఇప్పుడు దాదాపు కరోనా ముందుస్థాయిలోనే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న దేశంలో అత్యధిక దేశీయ రోజువారీ విమాన ట్రాఫిక్ను నమోదు అయింది. ఒక ఎయిర్లైన్స్ 456,082 మందిని తీసుకువెళ్లింది.
రూ.లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్
భారతదేశం గత 65 సంవత్సరాలలో 74 విమానాశ్రయాలను నిర్మించారు. మా ప్రభుత్వం గత 9 సంవత్సరాలలో 74 విమానాశ్రయాలను, హెలిపోర్ట్లను, వాటర్ ఏరోడ్రోమ్లను నిర్మించింది. వీటి సంఖ్యను రెట్టింపు చేసి 148కి పెంచుతాం. వచ్చే నాలుగేళ్లలో మొత్తం 200 ఎయిర్పోర్టులు అందుబాటులోకి వస్తాయి. ఇందుకోసం రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం.
- కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా