సంక్రాంతి వస్తుందంటే పెద్ద సినిమాలన్నీ రిలీజ్కు క్యూ కడతాయి. వాటికి థియేటర్స్ సర్దుబాటు చేయడమే పెద్ద కష్టం. అలాంటిది చిన్న సినిమాలు ఆ దరిదాపుల్లోకి రావడం అసాధ్యం. కానీ ఈసారి సంక్రాంతికి సీన్ మారింది. చిన్న సినిమాల్లో పండుగ కళ కనిపిస్తోంది. అందుకు ఏకైక కారణం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వాయిదా పడటమే.
జాక్పాట్ కొట్టినట్టే
సంక్రాంతి నుంచి సమ్మర్ వరకూ వరుస పెద్ద సినిమాలు ఉండడంతో ఇప్పుడప్పుడే తమ సినిమాల విడుదల కష్టం అనుకున్న చిన్న చిత్రాల నిర్మాతలకు ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడటం వరంగా మారింది. చిన్న చిత్రాలన్నీ వరుసగా థియేటర్స్కి వచ్చేస్తున్నాయి.
అతిథిగా ఆది
ఆది సాయి కుమార్, నువేక్ష జంటగా నటించిన చిత్రం ‘అతిధి దేవో భవ’. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల కలిసి నిర్మించారు. నిన్న ప్రసాద్ ల్యాబ్స్లో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘హారర్ ఎలిమెంట్స్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సినిమా కొత్తగా ఉండడంతో పాటు తన క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది’ అని చెప్పాడు ఆది.
సంక్రాంతి అల్లుళ్లు
చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న ‘సూపర్ మచ్చి’ సినిమాని జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కన్నడ నటి రచితా రామ్ హీరోయిన్. రిజ్వాన్ నిర్మాత. మరోవైపు మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా శ్రీరామ్ ఆదిత్య తీసిన ‘హీరో’ సినిమా జనవరి 15న వస్తోంది.
పొంగల్ రాజులు
వర్షం, ఒక్కడు లాంటి హిట్స్ తో ‘సంక్రాంతి రాజు’ గా పేరొందిన నిర్మాత ఎం.ఎస్ రాజు.. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సంక్రాంతికి తన సినిమాను తీసుకొస్తున్నారు. సుమంత్ అశ్విన్, మెహర్ చావల్ జంటగా ఆయన డైరెక్ట్ చేసిన ‘7 డేస్ 6 నైట్స్’ని సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్టు నిన్న అనౌన్స్ చేశారు. మరో నిర్మాత దిల్రాజు తన తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ నిర్మించిన ‘రౌడీ బాయ్స్’ని జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. హర్ష కొనుగంటి దర్శకుడు.
ఇక ‘ఆర్ఆర్ఆర్’ కోసం దారి వదులుతూ ‘భీమ్లా నాయక్’ని వాయిదా వేసుకున్న సితార సంస్థ, ఇప్పుడా డేట్లో తాము నిర్మించిన ‘డిజె టిల్లు’ని దింపుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా విమల్ కృష్ణ తీసిన ఈ మూవీని జనవరి 14న విడుదల చేస్తున్నారు. అలాగే రానా నటించిన పీరియాడికల్ మూవీ ‘1945’ని జనవరి 7న విడుదల చేస్తున్నట్టు నిర్మాత సి.కళ్యాణ్ అనౌన్స్ చేశారు.