పదేళ్లుగా లేని సామాజిక న్యాయం.. ఇప్పుడే ఎందుకు కొత్త రాగం !

పదేళ్లుగా లేని సామాజిక న్యాయం.. ఇప్పుడే ఎందుకు కొత్త రాగం !

ఒక ప్రముఖ నాయకురాలి చిట్​చాట్​లు, బహిరంగ ప్రకటనలు, అంతర్గత పార్టీ వ్యవహారాలపై ఆమె చేసిన విమర్శలతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చ కొత్త కోణంలోకి అడుగుపెట్టింది. నాయకత్వ లోపాలు, అంతర్గత  ప్రజాస్వామ్యం కొరవడటం వంటి అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు  తన పార్టీ అధినేతనే లక్ష్యంగా చేసుకున్నాయి. మరోవైపు తమ అధినేతకు కాళేశ్వరం దర్యాప్తులో నోటీసులివ్వడంపై నిరసన కార్యక్రమం చేపట్టడం ఒక విచిత్రం.  

వ్యక్తిగత రాజకీయాన్ని సామాజిక తెలంగాణ కోసమే అంటోంది.  ఈ మొత్తం వ్యవహారం అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజకీయాలను ఎలా అర్థం చేసుకోవాలి.  ఓటుబ్యాంకు రాజకీయాల వెనుక ఉన్న వ్యూహాలను ఎలా విశ్లేషించాలనే అంశాలపై లోతైన ఆలోచనకు దారితీస్తోంది. 

 
గత ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీకి ఎదురైన పరాజయం తర్వాత, ఆ పార్టీలో అంతర్గత సంక్షోభం తారస్థాయికి చేరిందనడానికి ఈ పరిణామాలు ఒక స్పష్టమైన సంకేతమా?  ఈ ప్రశ్నకు అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. ఆ నాయకురాలు తన ప్రసంగాల్లో  ‘సామాజిక న్యాయం’  ఆవశ్యకత,  వెనుకబడిన వర్గాలకు  రిజర్వేషన్ల పెంపు,  కులగణన ఆవశ్యకతను నొక్కి చెప్పడం గమనార్హం.  

క్షేత్రస్థాయి నాయకత్వాన్ని విస్మరించడం వంటి సమస్యలను వెలుగులోకి తెచ్చింది. ఇది కేవలం ఒక అంతర్గత విభేదంగా కాకుండా, సామాజిక న్యాయానికి సంబంధించి తీసుకున్న మరొక కొత్త రాగంగా భావించవచ్చు. ఈ పరిణామాలు అధికారంలో ఉన్న పక్షానికి, ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాలని చూస్తున్న శక్తులకు కూడా తమ రాజకీయ వ్యూహాలను మరింత పదును పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. 

ఈ నాయకురాలి వ్యాఖ్యల వెనుక ఆమె వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు, పార్టీలో తన స్థానం పదిలం చేసుకోవాలనే తపన ఉన్నప్పటికీ, అవి లేవనెత్తిన అంశాలు మాత్రం ప్రజలందరికీ సంబంధించినవే.

ఓటుబ్యాంకు రాజకీయాలు 

రాజకీయాల్లో  ఓటుబ్యాంకు రాజకీయాలు ఒక అనివార్యమైన భాగం.  ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఓట్లు ఏ రాజకీయ పక్షం విజయానికి అయినా అత్యంత కీలకం.  రాష్ట్ర జనాభాలో ఈ వర్గాలు గణనీయమైన వాటాను కలిగి ఉండటంతో, వారిని తమవైపు తిప్పుకోవడానికి అన్ని పక్షాలు  నిరంతరం ప్రయత్నిస్తాయి.  గతంలో అధికారంలో ఉన్న పక్షం, వివిధ సంక్షేమ పథకాలతో ఈ వర్గాల ఓట్లను తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేసింది. 

అయితే, ప్రస్తుత పరిణామాలు ఈ ఓటుబ్యాంకు  రాజకీయాలపై కొత్త చర్చకు దారితీశాయి. ఒక బలమైన నాయకుడు, ఒక వర్గం ఓట్లను మళ్లించడంలో లేదా ఏదైనా ఒక సామాజిక వర్గం ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సూత్రధారులనే ఊహాగానాలు తరచుగా వినిపిస్తుంటాయి.  ఇది ఒక పక్కా వ్యూహంలో భాగమనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. 

ముఖ్యంగా, అణగారిన వర్గాల ఓట్లను కేవలం ఒక బ్యాంకుగా చూస్తూ, ఆయా అగ్రవర్ణాలు చేస్తున్న రాజకీయాలు నిశితంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ వర్గాల ఓటు బ్యాంకు మళ్లింపు వంటి వ్యూహాలు, ఆయా వర్గాల నాయకులను లేదా వారి కుటుంబ సభ్యులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా అణగారిన వర్గాలు తమకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తారుతప్ప, వారి నిజమైన సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఎంతవరకు కట్టుబడి ఉన్నారో ప్రశ్నించుకోవాలి. 

బలహీన వర్గాల రాజకీయ అవగాహన 

ఇది తెలంగాణ చాణక్యుడి వ్యూహమా?  గతంలో ఎస్సీ వర్గాల ఓటుబ్యాంకును మళ్లించడానికి చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, ఇది ఒక కొత్త వ్యూహమా అనేది ప్రజలు ఆలోచించాలి.  గతంలో ప్రకటించిన కొన్ని పథకాలు,  హామీలు పూర్తిస్థాయిలో నెరవేరకపోవడం, ఎస్సీవర్గాల్లో ఆశించిన స్థాయిలో మార్పు రాకపోవడం వంటివి ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నాయి.  అటువంటి  పరిస్థితుల్లో  కొత్త ముఖాలతో, కొత్త నినాదాలతో  బలహీన వర్గాలు ముందుకురావడం, వారిని మరోసారి తమవైపు తిప్పుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంగా ప్రజలు విశ్లేషించుకోవాలి. 

బలహీన వర్గాలు  తమకు దక్కాల్సిన న్యాయం, విద్య, ఉద్యోగ అవకాశాలు, భూమి, వనరులపై హక్కులు, స్థానిక సంస్థల్లో సరైన ప్రాతినిధ్యం వంటి అంశాలపై వారికి స్పష్టమైన అవగాహన ఉండాలి. కేవలం ఎన్నికల ముందు ఇచ్చే హామీలకు, తాత్కాలిక ప్రయోజనాలకు లొంగిపోకుండా,  దీర్ఘకాలికంగా తమ వర్గాల అభివృద్ధికి, సామాజిక సాధికారతకు ఏ పక్షం, ఏ నాయకుడు నిజంగా కట్టుబడి ఉన్నారో నిశితంగా పరిశీలించాలి. 

సామాజిక తెలంగాణ వాస్తవ రూపం దాల్చాలి

కులగణన, రిజర్వేషన్ల పెంపు వంటి డిమాండ్లు కేవలం రాజకీయ నినాదాలుగానే మిగిలిపోకుండా, వాటిని అమలుచేసే చిత్తశుద్ధిని, అందుకు అవసరమైన వ్యవస్థాగత మార్పులను ఏ పక్షం తీసుకొస్తుందో గమనించాలి.  ఒక నాయకుడు లేదా ఒక పార్టీ తమకు మద్దతిచ్చినందున ఆ వర్గానికి నిజంగా మేలు జరుగుతుందా లేదా అన్న ప్రశ్నను బలహీన వర్గాలు తమకు తాము వేసుకోవాలి.  

తాజాగా జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పార్టీల అంతర్గత స్వరూపాన్ని, నాయకుల మధ్య సంబంధాలను, వారి వ్యూహాలను లోతుగా పరిశీలించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని  తమ భవిష్యత్తుకు నిజంగా ఎవరు బాటలు  వేస్తారో  గుర్తించగలిగినప్పుడే,  ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు  కేవలం  ఓటుబ్యాంకుగా  కాకుండా, బలమైన రాజకీయ శక్తిగా  అవతరించగలుగుతాయి. అప్పుడే ‘సామాజిక తెలంగాణ’ అనే  ఆకాంక్ష  కేవలం నినాదంగా కాకుండా,  ఒక వాస్తవ రూపం దాల్చుతుంది.  రాబోయే ఏ ఎన్నికలలోనైనా ఈ వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండి, సరైన నిర్ణయాలు తీసుకోవడం అత్యవసరం. 


- డా.కట్కూరి,
సైబర్ సెక్యూరిటీ 
న్యాయనిపుణుడు