ఇట్ల వాడితే ఎట్లరబయ్‌‌ : ఫేక్ అకౌంట్లతో అమ్మాయిలకు వల

ఇట్ల వాడితే ఎట్లరబయ్‌‌ : ఫేక్ అకౌంట్లతో అమ్మాయిలకు వల

హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియా క్రైమ్‌‌‌‌కు కేరాఫ్‌‌‌‌గా మారుతోంది. ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌, ట్విట్టర్‌‌‌‌ నకిలీ ప్రొఫైల్స్‌‌‌‌తో కేటుగాళ్లు వల వేస్తున్నారు. ఇన్‌‌‌‌స్టా్గ్రామ్‌‌‌‌తో ఇల్లీగల్‌‌‌‌ పనులు చేస్తున్నారు. టీనేజ్, సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ యువతులు, సొసైటీలో హోదాలో ఉన్న మహిళలను నకిలీ ప్రొఫైల్స్‌‌‌‌తో ట్రాప్‌‌‌‌ చేస్తున్నారు. అసభ్య మెసేజ్‌‌‌‌లు పెడుతున్నారు. బ్లాక్‌‌‌‌మెయిల్‌‌‌‌ చేస్తున్నారు. అందినకాడికి లాగుతున్నారు. మరోలా కసి తీర్చుకుంటున్నారు. సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ కేటుగాళ్ల దెబ్బకు కొందరు డబ్బు పోగొట్టుకుంటే, మరికొందరికి మనశ్శాంతి కరువైతే, ఇంకొందరి కాపురాలే కూలిపోయాయి. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్‌‌‌‌ సహా ప్రముఖుల ఫొటోలూ మార్ఫ్‌‌‌‌ చేసి వైరల్‌‌‌‌ చేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌‌‌‌ సీఎం మమతా బెనర్జీ ఫొటో మార్ఫింగ్‌‌‌‌ కేసూ దుమారం రేపుతోంది.

ఎవరో ఏంటో తెలియకుండా..

మూసాపేట్‌‌‌‌కు చెందిన ఓ యువతికి ఈ మధ్య ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అవతలి వ్యక్తి గురించి ఏం సమాచారం తెలియకుండా ఆ యువతి చాట్‌‌‌‌ చేసింది. ఆ కేటుగాడు యువతి ఫోన్ నంబర్ తెలుసుకున్నాడు. ఇద్దరూ వాట్సాప్ వీడియో కాల్స్, ఫోటోలు ఎక్స్‌‌‌‌చేంజ్ చేసుకున్నారు. ఇంకేముంది తన దగ్గరున్న యువతి ఫొటోలు, వీడియోలతో అతడు వేధింపులకు పాల్పడ్డాడు. విసిగిపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫేస్‌‌‌‌బుక్ మోసగాన్ని  అరెస్టు చేశారు.

కుటుంబ కలహాలతో దోస్తానా

అమెరికాలో డాక్టరంటూ ఓ నైజీరియన్ ఓ వివాహితను ట్రాప్ చేశాడు. ఫేస్‌‌‌‌బుక్ ప్రొఫైల్‌‌‌‌లో మంచి అమెరికన్ ఫొటో పోస్టు చేసి నమ్మించాడు. అప్పటికే కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉన్న యువతి ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్‌‌‌‌ను ఓకే చేసింది. వాళ్లిద్దరి మధ్య జరిగిన చాటింగ్ యువతిని పెళ్లి వరకు తీసుకెళ్లింది. పెళ్లి కోసం హైదరాబాద్ వస్తున్న తనను ముంబై ఎయిర్‌‌‌‌పోర్టులో అరెస్టు చేశారన్న నైజీరియన్ మాటలు నమ్మి రూ. 4 లక్షలు ట్రాన్స్‌‌‌‌ఫర్ చేసింది. తరువాత అతని నుంచి స్పందన లేక పోవడంతో పోలీసులను ఆశ్రయించింది. ఓ నైజీరియన్‌‌‌‌ ఇదంతా చేశాడని పోలీసులు గుర్తించారు.

భార్య ఫోటో కాల్‌‌‌‌గర్ల్స్‌‌‌‌ సైట్‌‌‌‌లో

ఇంకో కేసులో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు భార్య ఫొటోను కాల్‌‌‌‌గర్ల్స్‌‌‌‌ సైట్లలో పోస్టు చేసేంత వరకు తీసుకెళ్లింది. పెళ్ళైన 6 నెలలకే వాళ్ల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో భార్య ఫొటోను ఫోన్ నంబర్‌‌‌‌తో సహా కాల్‌‌‌‌గర్ల్స్‌‌‌‌ సైట్లలో భర్త పోస్టు చేశాడు. భార్య ఫొటోతో నకిలీ ఫేస్‌‌‌‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి తనకు తెలియని వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌‌‌‌లు పంపాడు. అసభ్యకరమైన పోస్టు చేశాడు. తనకు వచ్చిన కాల్స్‌‌‌‌తో ఫేక్ ఫేస్ బుక్ విషయం తెలుసుకున్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

టీనేజ్ అమ్మాయిలే ఎక్కువ

నెట్టింట్లో కొత్త ఫ్రెండ్ షిప్ కోరుకునే యువతులే ఎక్కువగా బాధితులవుతున్నారు. గతేడాది నమోదైన 385 కేసుల్లో విద్యార్థినిలు, ఉద్యోగినులే ఎక్కువున్నారని పోలీసులు చెప్పారు. హై ప్రొఫైల్ అధికారినులు, రాజకీయ నేతలు కూడా సోషల్‌‌‌‌ మీడియా బాధితులవుత్ను కేసులు కోకొల్లలు. లీడర్ల ఫొటోలు మార్ఫ్‌‌‌‌ చేసి అసభ్యకర వార్తలు షేర్‌‌‌‌ చేస్తున్న కేసులు ఏటా పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇలాంటి వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించి కేసు తీవ్రతను బట్టి యాక్షన్ తీసుకుంటున్నారు. ఇలాంటి కేసులు ఏటా పెరుగుతుండటంతో నిందితులపై పీడీ యాక్ట్‌‌‌‌నూ ప్రయోగిస్తున్నారు.