న్యూఢిల్లీ : భారీగా అప్పులు తీసుకున్న కొంత మంది మన బిజినెస్ టైకూన్స్ మార్కెట్లో కొంత ఇబ్బంది పడుతున్నారు. 236 బిలియన్ డాలర్ల విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంపైర్ కట్టిన గౌతమ్ అదానీ తన సంపదలో అయిదింట మూడొంతులను నెల రోజుల్లోనే పోగొట్టుకున్నారు. ఇంత పెద్ద సమస్య కాకపోయినా, మరో బిజినెస్ టైకూన్ కూడా చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు లండన్లో లిస్టింగ్ పొందిన అనిల్ అగర్వాల్ కంపెనీ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ అప్పులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో చెల్లించాల్సిన బిలియన్ డాలర్ల బాండ్స్ మొత్తం కూడా ఇందులో కలిసే ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడానికి..రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి ముందు అంటే కిందటేడాది ఇదే టైములో కమోడిటీస్ ధరలు ముప్ఫై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒకే క్వార్టర్లో పెరిగాయి. సరిగ్గా ఆ టైములోనే అప్పులలో కూరుకుపోయిన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ను బాగా డబ్బులున్న ముంబై లిస్టెడ్ కంపెనీ వేదాంత లిమిటెడ్తో విలీనం చేద్దామని అనిల్ అగర్వాల్ ప్లాన్ చేశారు. అప్పట్లోనే బ్లూమ్బర్గ్ ఈ ప్లాన్ను రిపోర్టు చేసింది కూడా. కానీ, ఈ ప్లాన్ ఎందువల్లో ముందుకు సాగలేదు.
రాబోయే కొన్ని వారాలు చాలా ముఖ్యం...
ఇప్పటిదాకా చూస్తే తన 10 బిలియన్ డాలర్ల అప్పును 8 బిలియన్డాలర్లకు వేదాంత రిసోర్సెస్ తగ్గించుకోగలిగింది. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ దాకా అప్పులు– వాటిపై వడ్డీలను వేదాంత రిసోర్సెస్ చెల్లించగలుగుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇంక్ అంచనా వేస్తోంది. ఆ తర్వాత అంటే సెప్టెంబర్ 2023 – జనవరి 2024 మధ్యలో ఈ కంపెనీ 1.5 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, అప్పుడు కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. కొత్త ఫండ్స్ సమీకరణ విషయంలో రాబోయే కొన్ని వారాలు వేదాంత గ్రూప్కు చాలా ముఖ్యమైన కాలం. ఏదైనా తేడా జరిగితే క్రెడిట్ రేటింగ్ పడిపోయే ప్రమాదం ఉంటుందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు.
