సంగారెడ్డి/కంది, వెలుగు: సంగారెడ్డి జిల్లా కంది మండలం మామాడిపల్లిలో పల్లె ప్రకృతివనం కోసం కేటాయించిన భూమిలో కొంత భూమి కబ్జా అయ్యింది. 484 సర్వే సంబర్లో పార్క్ కోసం కేటాయించిన 1.9 ఎకరాల భూమి సర్వే చేస్తుండగా దాదాపు అర ఎకరం తక్కువ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన ఈ భూమిని స్థానిక టీఆర్ఎస్ లీడర్ కబ్జా చేసినట్టు గ్రామ ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు ఆఫీసర్లు ఎలాంటి చర్య తీసుకోకపోగా ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి వెళ్లకుండా మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడంతో బుధవారం రెవెన్యూ అధికారులు రీసర్వే చేసేందుకు సిద్దపడ్డారు. ఈ భూమి పక్కన ఉన్న తన పొలం సర్వే కోసం అప్లికేషన్ పెట్టుకున్నానని, దాని తర్వాత 484 లో సర్వే చేయాలని స్థానికుడు ఒకరు కోరడంతో రెవెన్యూ అధికారులుమూడురోజుల గడువు ఇచ్చారు. ప్రకృతివనం ఏర్పాటు సందర్భంగా భూకబ్జా వ్యవహారం బయటకొచ్చినా అధికారులు సీరియస్గా తీసుకోలేదు. రెవెన్యూ. పంచాయతీరాజ్ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల 2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళింది. స్థానికులు అడిగినప్పుడల్లా రెండు శాఖల అధికారులు పొంతన లేని కారణాలు చెప్తూ తప్పించుకుతిరిగారు. గ్రామస్తులే పట్టువిడవకుండా ప్రయత్నించడంతో చివరికి బుధవారం రీసర్వేకు సిద్దపడ్డారు.
అప్పుడేం జరిగింది..
రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగామామిడిపల్లిలోని 484 సర్వేనెంబర్ లో 1.9 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రకృతి వనం కోసం అప్పటి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కేటాయించారు. ఊరి మధ్యలో ఈ స్థలం ఉండడంతో ఓ టీఆర్ఎస్ లీడర్ అందులో అర ఎకరం కబ్జా చేసి కాంపౌండ్వాల్ కూడా కట్టేశాడు. కలెక్టర్ ఆదేశాలతో సర్వే చేసిన రెవెన్యూ అధికారులు కబ్జాపై తమకెలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని గ్రామ సెక్రటరీ శ్రీధర్ స్వామి చెప్తుండగా.. తాము సర్వే రిపోర్ట్ పంచాయతికి ఇచ్చినట్టు తహసీల్దార్ విజయలక్ష్మి అంటున్నారు.అప్పటినుంచి వివాదం అలాగే ఉండిపోయింది.
సర్వే సగంలోనే...
భూకబ్జాపై రెవెన్యూ అధికారులు 10 నెలల తర్వాత స్పందించి మామిడిపల్లిలో బుధవారం రీ సర్వే చేపట్టారు. ప్రజల ఒత్తిడి మేరకు రెవెన్యూ, పంచాయతీ అధికారులు పోలీసుల సహకారంతో సర్వే నెంబర్ 484లో సర్వే ప్రారంభించారు. అయితే స్థానికుడు ఒకరు సర్వేకు అడ్డంపడ్డారు. వనం పక్కనే తమ స్థలం ఉందని, దాన్ని సర్వే చేయించేందుకు ఇదివరకే దరఖాస్తు పెట్టుకున్నానని అధికారులకు చెప్పాడు. రెండు మూడు రోజుల్లో తన సర్వే పూర్తయ్యాక ఇక్కడ సర్వే చేయాలని అధికారులను కోరాడు. దాంతో రెండు రోజుల తర్వాత సర్వే చేయిస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సర్వే చేస్తున్నాం
మామిడిపల్లి సర్వే నంబర్ 484లో 1.9 ఎకరాల కొంత భాగంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులొచ్చాయి. రెవెన్యూ అధికారులు సర్వే చేసి రిపోర్టు ఇవ్వాల్సిఉంది. కలెక్టర్ ఆదేశాలతో కబ్జాకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. బుధవారం పోలీస్ ప్రొటెక్షన్ తో కొంత సర్వే జరిగింది. రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయి.
సురేశ్ మోహన్, జిల్లా పంచాయతీ అధికారి ల