న్యూయార్క్: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా తన బయోగ్రఫీలో చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రముఖ కాంగ్రెస్ నేతలు ఒబామాపై విమర్శలు గుప్పించారు. సదరు బయోగ్రఫీ పుస్తకంలో రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గురించి ఒబామా రాసిన మరిన్ని విషయాలు తాజాగా బయటకొచ్చాయి.
మన్మోహన్ సింగ్తో రాహుల్ గాంధీకి ఎలాంటి ప్రమాదం లేనందునే సోనియా గాంధీ ఆయనను ప్రధాని పీఠం ఎక్కించారని ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ అనే బుక్లో ఒబామా పేర్కొనడం గమనార్హం. ‘మన్మోహన్ సింగ్ను ఓ రాజకీయ పరిశీలకుడిగా సోనియా ఎంచుకున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని మన్మోహన్తో.. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోబోయే రాహుల్తోపాటు తనకూ ప్రమాదం లేదని ఆమె నమ్మారు. అందుకే మన్మోహన్ను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టారు. మన్మోహన్ సింగ్ చాలా తెలివైన, లోతుగా ఆలోచించగల, నిజాయితీ కలిగిన వ్యక్తి’ అని ఒబామా తన పుస్తకంలో రాసుకొచ్చారు.