కాంగ్రెస్ చీఫ్‌గా సోనియా కంటిన్యూ.. హైడ్రామాకు ఫుల్‌స్టాప్‌!

కాంగ్రెస్ చీఫ్‌గా సోనియా కంటిన్యూ.. హైడ్రామాకు ఫుల్‌స్టాప్‌!

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై సోమవారం తీవ్ర డ్రామా నడిచింది. ఎట్టకేలకు ఈ వివాదానికి తెరపడిందని తెలుస్తోంది. ప్రస్తుతానికి పార్టీ చీఫ్‌గా సోనియా గాంధీనే కొనసాగనున్నారు. ఇప్పుడు నెలకొన్న కఠిన పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలను మరో ఆరు నెలలపాటు సోనియానే మోయాలని మెజారిటీ నేతలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరు నెలల పీరియడ్‌లో కొత్త చీఫ్‌ను కూడా ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.

‘మేడమ్ (సోనియా గాంధీ) కొనసాగాలి. ఎన్నికలు అతి త్వరలో జరుగుతాయి. ఇది వర్కింగ్ కమిటీ తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం’ అని కాంగ్రెస్ లీడర్ కేహెచ్ మునియప్ప చెప్పారు. పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటానని సోనియా చెప్పినప్పటికీ.. కష్ట కాలంలో ఆమె మరికొన్నాళ్లు కొనసాగాలని నేతలు సూచించారని సమాచారం. పార్టీ కొత్త చీఫ్‌ను కనుగొనే ప్రక్రియను మొదలు పెట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సోనియా ఆదేశించారని తెలుస్తోంది.