- పాక్పై ఇండియా ఘన విజయం
బెంగళూరు: సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ (శాఫ్) చాంపియన్షిప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తు చేస్తూ ఇండియా అదిరిపోయే బోణీ చేసింది. స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రి (10, 16, 74వ ని.) హ్యాట్రిక్ గోల్స్తో చెలరేగడంతో.. బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో ఇండియా 4–0తో పాకిస్తాన్ను ఓడించింది. ఉదాంత సింగ్ (81వ ని.) ఇండియాకు నాలుగో గోల్ అందించాడు. హ్యాట్రిక్తో ఛెత్రి ఇంటర్నేషనల్ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ (90) చేసిన రెండో ఆసియా ప్లేయర్గా నిలిచాడు. ఇంటర్ కాంటినెంటల్ కప్లో చూపెట్టిన ఫామ్ను ఇక్కడా కొనసాగించిన ఛెత్రి మ్యాచ్ ఆసాంతం ఫీల్డ్లో చురుకుగా కదులుతూ పాక్ డిఫెన్స్ను చెదరగొట్టాడు.
పదో నిమిషంలోనే అద్భుతమైన ఫీల్డ్ గోల్తో ఇండియాకు ఆధిక్యం అందించాడు. మరో ఆరు నిమిషాల తర్వాత లభించిన పెనాల్టీని గోల్గా మలిచి లీడ్ను 2–0కు పెంచాడు. సెకండ్ హాఫ్లో పాక్ డిఫెండర్లు ఛెత్రిని ఇన్సైడ్ సర్కిల్లో కిందపడేయడంతో రిఫరీ ఇండియాకు పెనాల్టీ కిక్ ఇచ్చాడు. దీన్ని ఉపయోగించి ఛెత్రి హ్యాట్రిక్ గోల్ కొట్టాడు. మరోవైపు వచ్చిన ఒకటి, రెండు చాన్స్లను సద్వినియోగం చేసుకోలేకపోయిన పాక్ ఖాతానే తెరువలేదు.
ఇండియా కోచ్ స్టిమాక్కు రెడ్ కార్డ్
ఇండియా 2–0 లీడ్తో ఫస్టాఫ్ ముగించబోతున్న సమయంలో గ్రౌండ్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. లైన్ వద్ద ఉన్న ఇండియా కోచ్ ఇగోర్ స్టిమాక్ అనవసరంగా పాక్ ప్లేయర్ అబ్దుల్లా ఇక్బాల్ త్రో–ఇన్ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అతని నుంచి బాల్ను తీసుకోవాలని చూడగా పాక్ ప్లేయర్లంతా తీవ్రంగా స్పందించారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిమీదకు మరొకరు దూసుకొచ్చారు. జోక్యం చేసుకున్న రిఫరీ వారిని అడ్డుకొని స్టిమాక్కు రెడ్ కార్డ్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ మొత్తం స్టిమాక్ సైడ్లైన్ దగ్గర కనిపించలేదు. ఇరు జట్లలో కొందరు ప్లేయర్లు ఎల్లో కార్డులు ఎదుర్కొన్నారు.