
- ఉమ్మడి మహబూబ్ నగర్, వికారాబాద్లోకి విస్తరణ
- మరో 5 రోజుల్లో రాష్ట్రమంతటా వర్షాలు
- 15 ఏండ్ల తర్వాత సీజన్కు ముందే రుతుపవనాలు ఎంటర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానాకాలం వచ్చేసింది. గత 10, 15 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా రెండు వారాల ముందే నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా.. వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోకి ఎంటర్ అయ్యాయి. మరో 5 రోజుల్లో రాష్ట్రమంతటా మాన్సూన్ విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడడం, మంగళవారం బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఈ సారి చాలా వేగంగా..
సాధారణంగా రాష్ట్రంలోకి రుతు పవనాలు జూన్ 10 న ఎంటర్ అవుతుంటాయి. నిరుడు జూన్ 3న ప్రవేశించాయి. కానీ, ఈ ఏడాది మాత్రం రెండు వారాల ముందుగానే రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యాయి. గత 15 ఏండ్లలో మాన్సూన్ ఇంత త్వరగా రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2021, 2024 లో మాత్రమే రుతుపవనాలు త్వరగా వచ్చాయి. 2021 లో జూన్ 5 న, 2024 లో జూన్ 3 న ఎంటర్ అయ్యాయి. 2015లో జూన్ 13, 2017 జూన్లో 12, 2018లో జూన్ 8, 2020 జూన్లో 11న కరెక్ట్ టైంకు రుతుపవనాలు వచ్చాయి. ఈ పదిహేనేండ్లలో ఐదేండ్లు రుతుపవనాలు అత్యంత ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 2019, 2023 లో అత్యంత ఆలస్యంగా జూన్ 21 న ఎంటర్ అయ్యాయి. ఆ తర్వాత 2014 లో జూన్ 19 న, 2016 లో జూన్ 18 న, 2022 లో జూన్ 13 న ప్రవేశించాయి.
4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
రుతుపవనాలు ప్రస్తుతం చాలా చురుగ్గా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తర తెలం గాణ మీదుగా ద్రోణి ఒకటి విస్తరించి ఉందని, మంగళవారం బంగాలఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం ఎల్లో అలెర్ట్, బుధవారం, గురువారం ఆరెంజ్ అలెర్ట్, శుక్రవారానికి ఎల్లో అలెర్ట్ను ఐఎండీ జారీ చేసింది.