
- బంగాళాఖాతంలో కనిపించని అనుకూల పరిస్థితులు
- అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలో వర్షాలు పడే చాన్స్
- జులైలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలుంటాయన్న ఐఎండీ
- ఎగువన కర్నాటక, మహారాష్ట్రల్లో వర్షాలు లేక ఇంకా స్టార్ట్కాని వరద
- రాష్ట్రంలో ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోకి కాస్త ముందస్తుగానే ఎంటరైన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు నెమ్మదించాయి. వచ్చేటప్పుడు ఎంత బలంగా వచ్చాయో.. ఇప్పుడు అంతగా బలహీనపడ్డాయి. ఫలితంగా రుతుపవనాలు ప్రవేశించిన తొలి వారం తప్ప ఎక్కడా పెద్ద వర్షాలు పడలేదు. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేకపోవడం, అల్పపీడన ప్రాంతాలు ఏర్పడకపోవడం, పశ్చిమ గాలుల ప్రభావం వంటి కారణాలతో ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు వీక్అయ్యాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
అయితే, బంగాళాఖాతంలో సరైన వెదర్ సిస్టమ్(అల్పపీడనాలు, ద్రోణులు) ఏర్పడితే రుతుపవనాలు మళ్లీ యాక్టివ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర భారతంలో నెలకొన్న పరిస్థితులు కూడా రుతుపవనాలు వీక్గా మారడానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. పశ్చిమ గాలుల ప్రభావం వల్లే అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీనే కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు మన రాష్ట్రంలోకి ఈ నెల 4న వచ్చాయి. ఆరు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. ఈ నెల 10 నుంచి మధ్య భారతంలో విస్తరిస్తున్న రుతుపవనాలు సడన్గా మందగకొడిగా మారిపోయాయి. తొలుత ఒక్క వారంలోనే సగం దేశంలో (దక్షిణ భారతం, ఈశాన్య రాష్ట్రాలు) వ్యాప్తి చెందిననప్పటికీ.. అక్కడి నుంచి మిగతా రాష్ట్రాలకు విస్తరించడంలో మాత్రం ఆశించిన వేగం కనిపించలేదు. మధ్య భారతంలోకి 10వ తేదీనే ఎంటరైనా.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు, హీట్వేవ్స్ పరిస్థితులతో దాదాపు రెండు వారాలు దాటినా అక్కడికి ఇంకా విస్తరించలేదు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, బిహార్లలో రుతుపవనాలు ఇంకా విస్తరించాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల్లో రుతుపవనాల విస్తరణకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని ఐఎండీ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.
జులైపైనే ఆశలు..
ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ ఎండిపోయాయి. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిస్తేనే కృష్ణా, గోదావరి నదులకు వరద మొదలవుతుంది. కానీ, మహారాష్ట్రలో రెండు మూడు రోజుల క్రితమే పూర్తి స్థాయిలో రుతుపవనాలు విస్తరించాయి. అక్కడ సరైన వర్షాలు లేవు. దీంతో నదులకు ఇంకా వరద ప్రారంభం కాలేదు.
అక్కడ వర్షాలు కురిస్తేనే కృష్ణా నదికి వరదలు స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్డ్యామ్లలో నీటిమట్టం డెడ్ స్టోరేజీ దిగువకు పడిపోయింది. శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను 36 టీఎంసీల నీళ్లే అందుబాటులో ఉన్నాయి. సాగర్ ప్రాజెక్ట్లో 312 టీఎంసీలకుగాను 122 టీఎంసీల జలాలే ఉన్నాయి. ఇటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోనూ అదే పరిస్థితి నెలకొంది. 91 టీఎంసీలకుగాను 8 టీఎంసీలే ఉన్నాయి. అయితే, జులైలో మంచి వర్షాలుంటాయని ఐఎండీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా వెదర్సిస్టమ్స్అన్నీ జులై ఫస్ట్ వీక్ నాటికి యాక్టివ్గా మారుతాయని, వర్షాలు జోరందుకుంటాయని చెబుతున్నారు. దీంతో ప్రాజెక్టులు నిండేందుకు అందరూ జులై కోసం ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జులైలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది.
ఐదు రోజులు వానలు..
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, జనగామ, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ జిల్లాల్లో బుధవారం పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జనగామ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షం కురిసింది. జనగామలోని వడ్లకొండలో అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అడుగంటిన నాగార్జున సాగర్
నాగార్జునసాగర్ రిజర్వాయర్ అడుగంటుతున్నది. డ్యామ్లో నీళ్లు తగ్గిపోయి రాళ్లు, రప్పలు తేలాయి. సాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 504 అడుగుల మేర మాత్రమే నీళ్లు ఉన్నాయి. వానలు లేకపోవడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి కూడా చుక్కనీరు రాకపోవడంతో రిజర్వాయర్ ఎండిపోతున్నది.