- హైకోర్టు పిటిషన్ను సుప్రీంలో సవాల్ చేయనున్న స్పీకర్
న్యూఢిల్లీ: గత పది రోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్ రాజకీయం తాజాగా సుప్రీం కోర్టుకు చేరింది. 18 మంది రెబల్ ఎమ్మెల్యేల విషయంలో శుక్రవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీ.పీ. జోషి సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నారు. “ పరిస్థితి రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తోంది” అని జోషి కామెంట్ చేశారు. “ నేను న్యాయమూర్తులను గౌరవిస్తాను. షో కాజ్ నోటీసు పంపే పూర్తి అధికారం స్పీకర్కు ఉంది. సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ పిటిషన్ వేయాలని మా లాయర్ను కోరాను. హైకోర్టు తీర్పు బాధ కలిగించింది” అని జోషీ అన్నారు. సొంత పార్టీపైనే తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో వారికి నోటీసులు ఇచ్చారు. స్పీకర్ సీ.పీ జోషి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో దాన్ని చాలెంజ్ చేస్తూ ఎమ్మెల్యేలంతా కోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఆ పిటిషన్ను విచారించిన కోర్టు ఈ నెల 24 వరకు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని తీర్పు చెప్పింది.
